యాదవులు రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలి
యాదవ సర్పంచుల సన్మాన మహోత్సవంలో నేతల పిలుపు
వనపర్తి,జనవరి10(తెలంగాణ ముచ్చట్లు):
యాదవులు రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలని, ప్రతి యాదవ సర్పంచ్ సీఎం స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో పనిచేయాలని జిల్లా గొర్రెల పెంపకదారుల సహకార సంఘం మాజీ చైర్మన్ పెండెం కురుమూర్తి యాదవ్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ రాములు యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవులు పిలుపునిచ్చారు.వనపర్తి జిల్లాలోని 14 మండలాల పరిధిలోని గ్రామపంచాయతీలకు చెందిన యాదవ సర్పంచులు, ఉపసర్పంచులకు ఘనంగా సన్మాన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కొత్తకోట మండల కేంద్రానికి సమీపంలోని శ్రీకృష్ణ దేవాలయ ఆవరణలో పండగ వాతావరణంలో నిర్వహించారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సర్పంచ్ అనేది గ్రామానికి ప్రధమ పౌరుడని, రాష్ట్రపతి తర్వాత గ్రామస్థాయిలో అన్ని అధికారాలు సర్పంచులకే ఉంటాయని పేర్కొన్నారు.ప్రభుత్వాలు ఏవి ఏర్పడినా యాదవులు అధిక సంఖ్యలో గెలిచి రాజకీయంగా మరింత బలంగా ఎదగాలని సూచించారు. యాదవులు కేవలం ఓటు వేసే యంత్రాలు కాదని, ప్రజాప్రతినిధులుగా గెలిచే ఆయుధాలుగా మారాలని అన్నారు.గతంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహకారంతో యాదవ జాతి అభివృద్ధికి విశేషంగా కృషి జరిగిందని గుర్తు చేస్తూ, అదే తరహాలో కాంగ్రెస్ పార్టీలోని ప్రజాప్రతినిధులు కూడా యాదవుల అభివృద్ధికి ముందుకు రావాలని కోరారు.వనపర్తి జిల్లాలో యాదవులు సుమారు 24 శాతం జనాభా ఉన్నారని, ఆ సంఖ్యకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం రావాలని అన్నారు.జిల్లాలోని సర్పంచులు, ఉపసర్పంచులు ఒకే వేదికపై చేరి ఘనంగా సన్మానం చేసుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. వనపర్తికి చెందిన సామాజిక సేవావేత్త, వాగ్దేవి జూనియర్ కళాశాల యజమాని, ఎస్ఏ బీయూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యాదవులకు భోజన వసతి కల్పించడంతో పాటు సర్పంచులు,ఉపసర్పంచులకు శాలువాలు, డైరీలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో యాదవ సంఘ నాయకులు, శ్రీకృష్ణ కమిటీ సభ్యులు, జిల్లాలోని 14 మండలాల గ్రామపంచాయతీ సర్పంచులు, ఉపసర్పంచులు, పెద్ద సంఖ్యలో వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.


Comments