రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్లో స్థానికులకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలి
బీజేపీ మండల అధ్యక్షులు మంతూర్తి శ్రీకాంత్ యాదవ్
ఎల్కతుర్తి, జనవరి 22 ( తెలంగాణ ముచ్చట్లు):
మండలంలోని సూరారం శివారులో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్లో ఉద్యోగాల భర్తీలో స్థానిక యువతి, యువకులకే తొలి ప్రాధాన్యత కల్పించాలని బీజేపీ మండల అధ్యక్షులు మంతూర్తి శ్రీకాంత్ యాదవ్ డిమాండ్ చేశారు.
గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రిలయన్స్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ మండల కేంద్రంలో స్థాపించబడటం ఆనందకరమైన విషయమని అన్నారు. అయితే ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న స్థానిక యువతను పక్కన పెట్టడం తగదని స్పష్టం చేశారు.
స్థానిక యువత విద్యార్హతలు, నైపుణ్యాలను బట్టి తగిన ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత పూర్తిగా కంపెనీ యాజమాన్యంపైనే ఉందని పేర్కొన్నారు. ఈ అంశంపై స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు చొరవ తీసుకొని కంపెనీ యాజమాన్యంతో చర్చించి మండలానికి చెందిన యువతి, యువకులకు అధిక సంఖ్యలో ఉద్యోగాలు దక్కేలా చర్యలు చేపట్టాలని కోరారు.
స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే పరిశ్రమల స్థాపనకు ప్రజల మద్దతు మరింత బలపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక యువకులు పాల్గొన్నారు.


Comments