పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన సబ్ ఇన్స్పెక్టర్లకు ఘన సన్మానం
మల్కాజిగిరి, డిసెంబర్ 31 (తెలంగాణ ముచ్చట్లు):
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్లో విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందుతున్న సబ్ ఇన్స్పెక్టర్లు పీఎం కృష్ణారావు (భువనగిరి క్రైమ్ స్టేషన్), వి. నరసింహ (షీ టీమ్) మరియు హోమ్ గార్డ్ జంగయ్యలకు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డీసీపీ అడ్మిన్ ఇందిరా మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగం అనేది ఎన్నో సవాళ్లు, ఒడిదుడుకులతో కూడుకున్నదని తెలిపారు. అటువంటి పరిస్థితుల్లో దీర్ఘకాలం పాటు క్రమశిక్షణతో, సమర్థవంతంగా విధులు నిర్వహించి పోలీస్ శాఖకు విశేష సేవలు అందించినందుకు పదవీ విరమణ పొందిన అధికారులను ఆమె అభినందించారు.పదవీ విరమణ అనంతరం విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే పెన్షన్ తదితర ఆర్థిక అంశాల్లో క్రమశిక్షణ పాటించాలని తెలిపారు. వారికి రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలు త్వరితగతిన అందేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శివకుమార్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాస్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు సిహెచ్. భద్రా రెడ్డి, కో-ఆపరేటివ్ ఏఓ ప్రదీప్, కో-ఆపరేటివ్ డైరెక్టర్ రవీంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments