గ్రామ పాలనాధికారులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి...
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్-15, తెలంగాణ ముచ్చట్లు
నిస్వార్ధంగా పనిచేస్తూ ప్రజలకు విశిష్ట సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్, నూతనంగా నియమించిన గ్రామ పరిపాలన అధికారులకు సోమవారం పోస్టింగ్ ఆర్డర్ లను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థను గ్రామ స్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రభుత్వం గ్రామాల్లో గ్రామ పరిపాలనా అధికారులను నియమించిందని తెలిపారు. జిల్లాలో 299 క్లస్టర్ లకు గాను 252 మంది అర్హులైన వారికి మెరిట్ ప్రకారం వారి స్వంత మండలం మినహాయించి, ఇతర ప్రదేశాల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు గ్రామ పరిపాలన అధికారులుగా పోస్టింగు ఇచ్చినట్లు తెలిపారు.
గ్రామ పాలన అధికారులు భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన నూతన రెవెన్యూ చట్టం భూ భారతి ను పటిష్టంగా అమలు చేసేందుకు బాధ్యతతో పనిచేయాలని అన్నారు. ప్రజల భూ సమస్యల పరిష్కారం పట్ల, నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని, ఉత్తమ సేవలతో రెవెన్యూ శాఖకు, జిల్లాకు మంచి పేరు తేవాలని కలెక్టర్ తెలిపారు.
రెవెన్యూ శాఖ ప్రభుత్వంలో చాలా కీలకమని ప్రభుత్వ భూముల సంరక్షణ, ప్రైవేటు, పట్టా భూముల నిర్వహణ, ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్ల జారీ వంటి అనేక కీలక బాధ్యతలు మన వద్ద ఉంటాయని, నిబంధనల ప్రకారం ప్రజలకు మెరుగైన సేవలు సకాలంలో అందించాలని, ఎక్కడ అవకతవకలకు పాల్పడడానికి వీలు లేదని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సిటిజన్ చార్ట్ ప్రకారం ప్రజలకు సకాలంలో సేవలు అందేలా చూడాలని, క్షేత్రస్థాయిలో గ్రామ పాలన అధికారులను నిరంతరం పర్యవేక్షిస్తామని అన్నారు. నేడు నియామక పత్రాలు పొందుతున్న అభ్యర్థులు వెంటనే విధులలో చేరాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ సంఘం జిల్లా అధ్యక్షులు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సునీల్ రెడ్డి, కలెక్టరేట్ ఏవో కారుమంచి శ్రీనివాసరావు, నూతన గ్రామ పరిపాలన అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Comments