గిరిజన ఆశ్రమ పాఠశాల వర్కర్స్ నిరవధిక సమ్మెకు బీఆర్ఎస్ సంఘీభావం
వర్కర్స్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వంపై డిమాండ్: మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
దమ్మపేట, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
రాష్ట్రవ్యాప్తంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్లో పనిచేస్తున్న డైలీవేజ్ వర్కర్స్ నిరవధిక సమ్మెలు కొనసాగుతున్నాయి. పర్మనెంట్ చేయడం, జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించడం, పెండింగ్ జీతాల విడుదలతో పాటు కొత్త మెనూ వల్ల పెరిగిన పనిభారం దృష్ట్యా అదనపు సిబ్బందిని నియమించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
పార్కలగండి, అంకంపాలెం, పెద్దగొల్లగూడెం, చీపురుగూడెం తదితర ఆశ్రమ పాఠశాలల్లో జరుగుతున్న సమ్మెలకు అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మండల నాయకులతో కలిసి సంఘీభావం తెలిపారు. అనంతరం మండల అధ్యక్షుడు దొడ్డా రమేష్, ఇతర నేతలతో కలిసి వర్కర్స్ను పరామర్శించారు.
వర్కర్స్ ఆవేదన: గతంలో కెసిఆర్ పాలనలో జీతాలు సమయానికి వచ్చేవి. ఇప్పుడు ఆరు నెలలు గడిచినా సరిగ్గా రావడం లేదు. జీతాలు పెంచడం మాకెప్పుడూ కనిపించింది కానీ సగం తగ్గించడం మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చూశాం. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె విరమించం అని హెచ్చరించారు.
మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన వారు సమ్మె విరమించకపోతే కొత్తవారిని తీసుకొస్తాం అని బెదిరించడం తగదు. రైతుల నుండి విద్యార్థుల దాకా అందరూ రోడ్డెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోయింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలి. లేకుంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొడ్డా రమేష్, దారా యుగంధర్, రావుల శ్రీను, జలగం వాసు, సొడెం గంగరాజు, రెడ్డిమల్ల నాగయ్య, మొగిలి కృష్ణ, వెంపటి భరత్, మల్లేష్, కాక శంకర్ ప్రసాద్, నరేంద్ర, రంగ, వెంకటేశ్వరరావు, బీమా రాజు, సూరి చలపతిరావు, మాజీ ఎంపీటీసీ కోర్స శ్రీను, మాజీ సర్పంచ్ కోర్స వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments