అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమస్యలు పరిష్కరించాలి
మల్కాజిగిరి, సెప్టెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):
అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కి అంగన్వాడీ యూనియన్ నాయకులు వినతి పత్రం అందజేశారు.తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ (సి ఐ టి యు) ప్రధాన కార్యదర్శి బి. శోభారాణి, అల్వాల్ ప్రాజెక్ట్ సహాయ కార్యదర్శి శిరీష మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లోనే ప్రీ ప్రైమరీ పీఎం శ్రీవిద్య నిర్వహించాలని, బోధనా బాధ్యతలను అంగన్వాడీ టీచర్స్కి అప్పగించాలని డిమాండ్ చేశారు.ఎఫ్ఆర్ఎస్ రద్దు, ఒకే ఆన్లైన్ యాప్ అమలు, ఉద్యోగులందరికీ 5జి మొబైల్ ఫోన్లు అందించాలని కోరారు.కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం రూ.18,000 వేతనం, పీఎఫ్ అమలు చేయాలని, అలాగే 24 రోజుల సమ్మె వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని పేర్కొన్నారు.మినీ టీచర్స్ కు 11 నెలల ఏరియర్స్, రిటైర్డ్ ఉద్యోగులకు 18 నెలల సి.బి.ఇ. బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని స్పష్టంచేశారు.నాయకులు మరింత గా మాట్లాడుతూ, కొత్త జాతీయ విద్యా విధానం (ఎన్ఈపి) ద్వారా ఐసిడిఎస్, విద్యా వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లలను విద్యాశాఖకు అప్పగించే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు నిరవధిక సమ్మెకు దిగుతారని హెచ్చరించారు.
Comments