వరంగల్ అభివృద్ధి అంశాలపై సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎంపీ కడియం కావ్య
కాజీపేటలో మల్టీమోడల్ ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం,
-కొత్త రైల్వే లైన్లపై సీఎం దృష్టి సారించాలని విజ్ఞప్తి
-చారిత్రాత్మక దేవాలయాల పునరుద్ధరణకు కేంద్ర నిధులు తీసుకురావాలని అభ్యర్థన
హైదరాబాద్,సెప్టెంబర్16(తెలంగాణ ముచ్చట్లు):
హైదరాబాద్లో మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు.కాజీపేట రైల్వే స్టేషన్ ఎదురుగా నూతన మల్టీమోడల్ ఆర్టీసీ బస్టాండ్ను త్వరితగతిన నిర్మించాలని సీఎం దృష్టికి ఎంపీ తీసుకువెళ్లారు. ఈ బస్టాండ్ ద్వారా ప్రయాణీకులకు అధిక సౌకర్యాలు కలుగుతాయని ఆమె అభిప్రాయపడ్డారు. భూపాలపల్లిలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడంతో పాటు భూపాలపల్లి–హసన్పర్తి మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణం జరగాలని, తద్వారా ప్రాంతీయ అభివృద్ధి వేగవంతం అవుతుందని వివరించారు.
అలాగే నష్కల్–హసన్పర్తి, చింతల్పల్లి–నష్కల్ మధ్య ప్రతిపాదిత రైల్వే బైపాస్ లైన్లు వరంగల్ మాస్టర్ ప్లాన్–2041కు విరుద్ధంగా ఉన్నాయని ఎంపీ ప్రస్తావించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, కుడా వంటి సంస్థలతో చర్చించకుండా ఈ ప్రతిపాదనలు రూపొందించారని విమర్శించారు. రైల్వే మౌలిక సదుపాయాలను ఔటర్ రింగ్ రోడ్ కి ఆనుకుని ప్రణాళిక చేయడం ద్వారా రైతుల సమస్యలు తీరడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నగరాభివృద్ధికి తోడ్పడుతుందని సూచించారు. ఈ విషయమై కేంద్ర రైల్వే మంత్రిని కూడా గతంలో కలిసి వినతిపత్రం సమర్పించినట్లు గుర్తుచేశారు.
చారిత్రాత్మక దేవాలయాల అభివృద్ధి అంశాన్ని కూడా ఎంపీ సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. వరంగల్లోని భద్రకాళి ఆలయం, వేయి స్తంభాల గుడి, చిల్పూర్ బుగులు వెంకటేశ్వరస్వామి ఆలయంతో పాటు భూపాలపల్లి జిల్లాలోని కోటగుల్లు (ఘణపూర్ దేవాలయం), నాపాక, రెడ్డిగుడి దేవాలయాల పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకం నిధులు తీసుకురావాలని కోరారు.ఈ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందజేస్తామని ఎంపీకి హామీ ఇచ్చారు.
Comments