ఓపెన్ స్కూల్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు....
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 15, తెలంగాణ ముచ్చట్లు;
ఓపెన్ స్కూల్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ తెలిపారు. కలెక్టరేట్ లో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షల నిర్వహణపై సోమవారం సంబంధిత అధికారులతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 28 వరకు జరిగే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఎస్.ఎస్.సి., ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఖమ్మం జిల్లాలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద త్రాగునీరు సరఫరా, కనీస మౌళిక సదుపాయాల కల్పన చేయాన్నారు. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్ నందు 287 మంది అభ్యర్థులకు ఓపెన్ ఎస్.ఎస్.సి. పరీక్షలు, రిక్కాబజార్ లోని జి.హెచ్.ఎస్. నందు 254 మంది అభ్యర్థులకు ఓపెన్ ఇంటర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 163 బి.ఎన్.ఎస్. సెక్షన్ పెట్టాలని, సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసి వేయాలని అన్నారు. ప్రశ్న పత్రాల తరలింపుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్ష కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు ఉండాలని, ఏఎన్ఎంలతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని, విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా బస్సులు నడిచేలా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో డిఆర్వో ఏ. పద్మశ్రీ , జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ బి. కళావతి బాయి, జిల్లా ఇంటర్మీడియట్ విద్య శాఖ అధికారి కె. రవిబాబు, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అధికారి మంగపతి రావు, పోలీస్, మునిసిపల్, పోస్టల్, విద్యుత్ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Comments