వివేకానంద విగ్రహం తొలగింపు అవసరం లేదు: హైకోర్టు.
* దేవాలయ ఉత్సవాలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం
జమ్మికుంట టౌన్ ఆగస్టు 06 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయ భూమిలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని తొలగించాల్సిన అవసరం లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే దేవాలయ రథోత్సవాలు, ఇతర ఉత్సవాలు, భక్తుల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
దేవాలయ వ్యవస్థాపక ట్రస్టీ కొండూరు రాజ్కుమార్ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ సుద్దాల చలపతి రావు విచారణ చేపట్టారు. దేవాలయ భూమిలో వివేకానంద విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల రథోత్సవాలకు అంతరాయం కలుగుతోందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అయితే మున్సిపాలిటీ తరఫు న్యాయవాది, విగ్రహాన్ని రోడ్ల కూడలిలోని ఐలాండ్పై ఏర్పాటు చేసినట్లు, దేవాలయ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని కోర్టుకు వివరించారు.
ఇరుపక్షాల వాదనలు, సమర్పించిన పత్రాలు, ఫొటోలను పరిశీలించిన హైకోర్టు రథోత్సవాల సమయంలో అవసరమైతే ట్రాఫిక్ను నియంత్రించాలని, రహదారులను తాత్కాలికంగా మూసివేయాలని, కూరగాయల మార్కెట్ను తాత్కాలికంగా వేరే ప్రాంతానికి తరలించాలని అధికారులను ఆదేశించింది. దీంతో రథోత్సవాలు, భక్తుల రాకపోకలు ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
అదేవిధంగా, స్వామి వివేకానంద జయంతి వంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే విగ్రహం వద్ద నివాళుల కార్యక్రమాలు నిర్వహించాలని, ఇతర సమయాల్లో అక్కడ జనసమూహం ఏర్పడి ప్రజలకు లేదా దేవాలయ కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.
ఈ మేరకు రిట్ పిటిషన్ను ముగిస్తూ, ఎటువంటి కోర్టు ఖర్చులు విధించకుండా ఉత్తర్వులు జారీ చేసింది.


Comments