మంత్రుల పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు.....
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

అక్టోబర్ 11న ఖమ్మం, పాలేరు, మధిర నియోజకవర్గాల్లో సమీకృత గురుకులాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన
ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలలో గురుకుల సముదాయ స్థలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
అక్టోబర్ 11న ఖమ్మం జిల్లాలో జరిగే ఉపముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఖమ్మం, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమీకృత గురుకులాల సముదాయాలు నిర్మించే స్థలాలను పరిశీలించారు. పాలేరు నియోజకవర్గానికి సంబంధించి ఖమ్మం రూరల్ మండలం పోన్నెకల్లు వద్ద , ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి రఘునాథపాలెం మండలం జింకల తండా వద్ద నూతనంగా నిర్మించనున్న సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలల సముదాయ స్థలాలను కలెక్టర్ పరిశీలించి, మంత్రుల పర్యటనకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్* మాట్లాడుతూ, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలల సముదాయం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందులో భాగంగా తొలి విడతలో జిల్లాలోని ఖమ్మం, పాలేరు, మధిర అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మాణాలకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పాలేరు నియోజకవర్గానికి సంబంధించి ఖమ్మం రూరల్ మండలం పోన్నెకల్లు వద్ద , ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలం జింకల తండా వద్ద, మధిర నియోజకవర్గం సంబంధించి బోనకల్ మండలం లక్ష్మీపురంలో సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలల సముదాయాలు నిర్మిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అక్టోబర్ 11న ఖమ్మం జిల్లాలో మంజూరైన సమీకృత గురుకులాలకు డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు హాజరై శంకుస్థాపన చేయడం జరుగుతుందని అన్నారు. అక్టోబర్ 11న ఉదయం 9 గంటలకు పాలేరు నియోజకవర్గం, 11 గంటలకు మధిర నియోజకవర్గం, మధ్యాహ్నం 2 గంటలకు ఖమ్మం నియోజకవర్గంలో శంకుస్థాపన చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మంత్రుల పర్యటన సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని, సభా స్థలం, సౌండ్ సిస్టం, ప్రజలకు సరిపడా కుర్చీలు, టెంట్, సభా వేదిక, పైలాన్ ఫోటో, వీడియోలతో అవగాహన ప్రదర్శన కోసం ఎల్ఈడీ ప్యానెల్ ఏర్పాటు, త్రాగునీరు సౌకర్యం, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా వసతుల కల్పన వంటి అంశాలను ప్రత్యేకంగా పరిశీలించి ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట శిక్షణ సహాయ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ, ఎస్ఇ ఆర్ అండ్ బి హేమలత, జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, అధికారులు, తదితరులు వున్నారు.


Comments