ఇంగ్లీషు బోధన కు ప్రణాళికాబద్ద చర్యలు తీసుకోవాలి
-జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు బోధన మెరుగుపరచడానికి ప్రణాళికాబద్ద చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ అధికారులు, ఇంగ్లీష్ మాధ్యమ ఉపాధ్యాయులతో ఇంగ్లీష్ బోధనపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన మెరుగుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయాలన్నారు. ప్రతి పాఠశాలలో అర గంట క్రీడలకు అన్ని తరగతుల వారికి, అరగంట ఇంగ్లీష్ బోధన ఎంపిక చేసిన తరగతుల వారికి తప్పక ప్రతిరోజు కేటాయించాలని, ఈ దిశగా రోజువారి టైం టేబుల్ రూపకల్పన చేయాలని అన్నారు. తరగతిలో సంభాషణ పూర్తిగా ఇంగ్లీష్ లో జరిగేలా చూడాలన్నారు. ప్రతి విద్యార్థి, గ్రామర్ దోషాలున్న ఇంగ్లీష్ లో మాట్లాడగలిగేలా ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. తెలుగు మీడియం చదివి, తెలుగు ప్రాధాన్యతతో ఉన్న ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ పై పట్టు కలిగేలా శిక్షణ కు చర్యలు తీసుకోవాలని అన్నారు. స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు తదితర వాటిలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి, ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యార్థులను తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పాఠశాలలకు సరఫరా చేసిన ఐఎఫ్బి ప్యానెళ్లను ఇంగ్లీష్ పై పిల్లలకు ఉత్సాహం కలిగేలా మంచి కాంటెంట్ గల గేయాలు, చిత్రాలు ప్రదర్శించి వారి దృష్టిని ఇంగ్లీష్ పై మల్లేలా చూడాలన్నారు. నియోజకవర్గానికి ఒక పాఠశాలను ఎంపికచేసి, ప్రయోగాత్మకంగా ఒక ఇంగ్లీష్ ల్యాబ్ ఏర్పాటుచేయాలని ఆయన తెలిపారు. విద్యార్థుల్లో నమ్మకం కలిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. భాష అనేది ఒక ఆయుధమని, ఈ దిశగా ఇంగ్లీష్ భాష పిల్లలు నేర్చుకోవాలనే ఆకాంక్ష కలిగేలా ఉపాధ్యాయులు చూడాలని కలెక్టర్ అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, ఏఎంఓ జి. రవి, ఇంగ్లీష్ ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, జగదీష్, రామనాధం, వసంత, ఎస్. రవి తదితరులు పాల్గొన్నారు.


Comments