250 గజాల ఇంటి స్థలం హామీ అమలు చేయాలి
మంత్రి పొంగులేటిని కలిసిన తెలంగాణ ఉద్యమకారులు
హైదరాబాద్,డిసెంబర్19(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి నేతృత్వంలో ఉద్యమకారులు మంత్రి పొంగులేటిని కలిసి విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లినవారు మాత్రమే కాకుండా, జైలుకు వెళ్లకపోయినా ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న ప్రతి ఒక్కరినీ గుర్తించి 250 గజాల ఇంటి స్థలం కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ కేసులు నమోదు కాకపోవడం వల్ల పలువురు ఇప్పటివరకు గుర్తింపుకు నోచుకోలేదని, అలాంటి వారిని కూడా లబ్ధిదారులుగా గుర్తించాలని కోరారు.
250 గజాల ఇంటి స్థలాల కేటాయింపుకు ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపసంఘ కమిటీని ఏర్పాటు చేసి, స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వాలు ఉద్యమకారులను గుర్తించడంలో విఫలమయ్యాయని, దాని వల్ల అనేక మంది ఉద్యమకారులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఉద్యమ కాలంలో ఎదురైన కష్టాల కారణంగా పలువురికి ఆరోగ్య సమస్యలు వచ్చి, ఉపాధి అవకాశాలు కోల్పోయిన పరిస్థితి ఉందని, అలాంటి వారందరినీ గుర్తించి ఇంటి స్థలంతో పాటు ఉద్యమకారులకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని కోరారు.
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి ఉద్యమకారులను కలుస్తామని పిడమర్తి రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర సమన్వయకర్తలు డాక్టర్ బొమ్మెర స్టాలిన్, బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బోరెల్లి సురేష్తో పాటు ఉద్యమకారులు నక్క మహేష్, జోగు గణేష్, మీసాల మహేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Comments