అర్చకుల సంక్షేమానికి అంకితమైన నాయకత్వం.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సదానిరంజన్ సిద్ధాంతికి ఘన సన్మానం.
ఎల్కతుర్తి , ఆగస్టు 10 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్ర వీరశైవ జంగమ ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ గ్రామానికి చెందిన సదానిరంజన్ సిద్ధాంతిని హనుమకొండ జంగమ సమాజం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.
సదానిరంజన్ సిద్ధాంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం వీరశైవ జంగమ అర్చక పురోహితుల ఐక్యతకు నిదర్శనమని జంగమ సమాజం సభ్యులు పేర్కొన్నారు. అర్చకుల సమస్యల పరిష్కారం, వారి హక్కులు, సంక్షేమం, గౌరవం కోసం ఆయన మరింత చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
రాష్ట్రంలోని జంగమ ధూప దీప నైవేద్య అర్చకులను సంఘటితం చేసి, వారి సమస్యలను ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా అర్చకులకు అందాల్సిన సంక్షేమ పథకాలు, సౌకర్యాలు, హక్కులు సమర్థవంతంగా అందేలా కృషి చేయాలని సూచించారు. అర్చక వృత్తి గౌరవాన్ని మరింత పెంచే విధంగా సంఘాన్ని ముందుకు నడిపించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా సదానిరంజన్ సిద్ధాంతి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘం నాయకులు, అర్చక పురోహితులు, జంగమ సమాజం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తూ రాష్ట్రంలోని వీరశైవ జంగమ ధూప దీప నైవేద్య అర్చకుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. అర్చక పురోహితుల ఐక్యతే సంఘం బలోపేతానికి ప్రధానమని, అందరి సహకారంతో సంఘాన్ని మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.
కార్యక్రమంలో హనుమకొండ జంగమ సమాజం అధ్యక్షులు గురుమూర్తి గురుదత్త, వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ బాబు, మాజీ కౌన్సిలర్ శివకుమార్, మఠం రాజేష్ కుమార్, భద్ర దేవ్, చరణ్, శివప్రసాద్, మహిళా సభ్యులు ఉమాదేవి, గిరిజ తదితరులు పాల్గొన్నారు.


Comments