చిల్కానగర్ ఎంపిపిఎస్ ప్రభుత్వ పాఠశాలకు నిధులు కేటాయించండి
కార్పొరేటర్ బన్నాల
చిల్కానగర్, డిసెంబర్ 07 (తెలంగాణ ముచ్చట్లు) :
ఉప్పల్ నియోజకవర్గ చిల్కానగర్ ఎంపిపిఎస్ ప్రభుత్వ పాఠశాలకు అదనపు గదుల నిర్మాణం కోసం తక్షణం నిధులు కేటాయించాలని కోరుతూ చిల్కానగర్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ శనివారం రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ను ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, 2024 డిసెంబర్లో అప్పటి డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ నరసింహారెడ్డిని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి కలసి అదనపు గదుల నిర్మాణానికి సంబంధించిన వినతిపత్రం సమర్పించిన విషయాన్ని పేర్కొన్నారు. ప్రాతినిధ్యాలు కు సంబంధించిన పత్రాలను కూడా డైరెక్టర్కి అందజేశారు.ప్రస్తుతం పాఠశాల భవనం శిథిలావస్థలోకి చేరడంతో పాటు విద్యార్థులు తరగతి గదుల కొరతతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని గీతా ప్రవీణ్ వివరించారు. వెంటనే నిధులు కేటాయించి పాఠశాల భవనం మరమ్మతులు మరియు అదనపు గదుల నిర్మాణం చేపట్టాలని కోరారు.దీనిపై డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ సానుకూలంగా స్పందిస్తూ, ఈ ఆర్థిక సంవత్సరంలో కచ్చితంగా నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు కార్పొరేటర్ తెలిపారు.


Comments