ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దహనం
వేలేరు,డిసెంబర్18(తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం పీచర గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను శాసనసభ స్పీకర్ కొట్టివేయడంతో, తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని, పార్టీ మారలేదని కడియం శ్రీహరి ఇచ్చిన వివరణపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఈ సందర్భంగా గ్రామంలో నిరసన కార్యక్రమం నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు “ప్రజలను ఎన్నాళ్లు మోసం చేస్తారు?” అంటూ నినాదాలు చేశారు. కడియం కావ్యను గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రచారం చేసిన విషయం ప్రజలకు తెలిసిందేనని, ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమేనని విమర్శించారు. ఇది నియోజకవర్గ అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయమా? లేక ప్రజలను తప్పుదారి పట్టించడానికా? అని ప్రశ్నించారు.
మాజీ జడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, తాము ఏ పార్టీలో ఉన్నామో కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితిలో ఎమ్మెల్యే ఉన్నారని మండిపడ్డారు. అబద్ధపు వాగ్దానాలతో ప్రజలను మోసం చేయడం సరికాదని అన్నారు. దమ్ముంటే తెలంగాణ భవన్కు వెళ్లి కేసీఆర్, కేటీఆర్ను కలిసి, రాజీనామా చేసి బీఆర్ఎస్ కండువా కప్పుకుని రావాలని సవాల్ విసిరారు. అప్పుడు మాత్రమే బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతిస్తాయని స్పష్టం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో పోలు తిరుపతి,మారబోయిన రాజు, కొయ్యడా మహేందర్, ఎండీ హరీఫ్, జంపయ్య, రాకేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. 


Comments