గ్లోబల్ సమ్మిట్ భద్రతపై డీజీపీ శివధర్ రెడ్డి సమీక్ష
మహేశ్వరం, డిసెంబర్ 05 (తెలంగాణ ముచ్చట్లు)
రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి భద్రతా ఏర్పాట్లపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి వివిధ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో అడిషనల్ డీజీపీలు మహేష్ భగవత్, డీఎస్ చౌహాన్, ఫైర్ డీజీ విక్రం సింగ్ మాన్, టీజీ ఐఐసి ఎండీ శశాంక్, ఐజీ రమేష్ రెడ్డి పాల్గొన్నారు.సమీక్ష అనంతరం డీజీపీ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ గ్లోబల్ సమ్మిట్కు సుమారు 3 వేల మంది జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు. డిసెంబర్ 8, 9 తేదీలలో మాత్రమే డెలిగేట్లకు ప్రవేశం ఇవ్వబడుతుంద ని, తరువాతి నాలుగు రోజుల పాటు సాధారణ ప్రజలకు అనుమతి ఉంటుందని చెప్పారు.సమ్మిట్ ప్రాంతంలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు, అడుగడుగునా నిఘా కోసం వెయ్యికిపైగా సీసీటీవీ కెమెరాలను అమర్చుతున్నట్టు తెలిపారు. ఇవన్నీ సెంట్రల్ పోలీస్ కంట్రోల్ రూమ్కు అనుసంధానమై ఉంటాయని చెప్పారు. సాయంత్రం లోపు అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం సుమారు వెయ్యి మంది ట్రాఫిక్ పోలీసులను నియమించనున్నట్టు వెల్లడించారు. రహదారుల మళ్లింపు, బారికేడ్ల ఏర్పాటు, పార్కింగ్ నిర్వహణ కోసం ట్రాఫిక్ మార్షల్స్ను వినియోగించనున్నట్లు తెలిపారు. రెండు రోజుల పాటు ప్రజలకు అసౌకర్యం కలగకుండా మార్గమళ్లింపులపై పటిష్ట చర్యలు చేపట్టనున్నట్టు వెల్లడించారు.
సమ్మిట్కు అవసరమైన బేరక్స్, మెస్, కిచెన్, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలపై కూడా అధికారులతో చర్చించినట్టు డీజీపీ తెలిపారు. భద్రత విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు.


Comments