దేశానికి ఆదర్శంగా అంగన్వాడి కేంద్రాలు
నవంబర్ 19 నాటికి భవనాల నిర్మాణం పూర్తి చేయండి
-వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడి కేంద్రాలను దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దే దిశగా అధికారులు కార్యాచరణ రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు, భద్రతా సమస్యలు ఎదురయ్యే అవకాశముందని హెచ్చరించారు.
పలు అంగన్వాడి కేంద్రాల్లో వర్షాల కారణంగా పెచ్చులు ఊడే పరిస్థితి ఉండటంతో, ఇలాంటి భవనాలను తక్షణమే గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ప్రైవేట్ భవనాలను అంగన్వాడి కేంద్రాలుగా మార్చాలన్నారు.
రాత్రి వేళల్లో తేళ్లు, జే రీలు వంటి విషపూరిత పురుగుల వల్ల ప్రమాదాలు తలెత్తే అవకాశమున్న నేపథ్యంలో కేంద్రాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. “మన ఇల్లు ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో అంగన్వాడి కేంద్రాలనూ అలాగే శుభ్రంగా ఉంచాలి” అని స్పష్టంచేశారు.
కొన్ని చోట్ల సిబ్బంది నిర్లక్ష్యం వల్ల చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన సీఎం, విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించబోమని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అంగన్వాడి కేంద్రాల పరిసరాల్లో పరిశుభ్రత, హాజరు శాతాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా అధికారులు అంగన్వాడి కేంద్రాలను నిరంతరం సందర్శిస్తూ పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు.
నవంబర్ 19 నాటికి 1000 కొత్త అంగన్వాడి భవనాల ప్రారంభం లక్ష్యంగా
ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న 1000 నూతన అంగన్వాడి కేంద్రాలను ప్రారంభించేలా భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ దిశగా లక్ష్యాన్ని నిర్దేశించిన ప్రభుత్వం, అవసరమైతే అదనపు నిధులను మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.ఫీడింగ్, టీచింగ్, అటెండెన్స్ వంటి అంశాలపై యంత్రాంగం పూర్తి దృష్టి సారించాలని సూచిస్తూ, చిన్నారుల అభివృద్ధికి అంగన్వాడి కేంద్రాలు కీలకమైన వేదికలుగా మారాలని సీఎం ఆకాంక్ష వ్యక్తం చేశారు.
Comments