ప్రతి ఓటరుకి కాంగ్రెస్ సంక్షేమం చేరాలి: జారె
అశ్వారావుపేట, నవంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
రాష్ట్రంలో వచ్చే నెల 11, 14, 17 తేదీల్లో జరిగే గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు సాధించాలంటే గ్రామస్థాయిలో కార్యాచరణ వేగవంతం చేయాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సూచించారు.
ములకలపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తోట దేవి ప్రసన్నతో కలిసి ఆయన పార్టీ శ్రేణుల సమావేశం నిర్వహించారు. అనంతరం అన్నపురెడ్డిపల్లి మండల గ్రామపంచాయతీ కార్యాలయంలో చేపట్టిన సమీక్షలో జారె కీలక మార్గదర్శకాలు ఇచ్చారు.
జారె మాట్లాడుతూ, గ్రామంలో ప్రతి కార్యకర్త ఓటరుని నేరుగా కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలి అన్నారు. బూత్ స్థాయిలో సమన్వయం బలపడితేనే పోలింగ్ రోజు పనితీరు సజావుగా సాగుతుందని స్పష్టం చేశారు. గ్రామ సమస్యలను గుర్తించి కార్యాచరణ ప్రణాళికలో చేర్చాలని, ప్రజల్లో నమ్మకం పెంపొందించేలా పనిచేయాలని సూచించారు. పార్టీ అంతర్గత ఐక్యతే విజయం దక్కించే కీలక అంశమని అన్నారు.
సమావేశాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో పాటు అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అన్నపురెడ్డిపల్లి మండలానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన పలు కుటుంబాలు కాంగ్రెస్లో చేరారు.


Comments