కేసీఆర్ ఉద్యమ పోరాటం – తరతరాలకి స్ఫూర్తి
మాజీ ఎంపీ నామ
ఖమ్మం బ్యూరో, నవంబర్ 28, తెలంగాణ ముచ్చట్లు;
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన దీక్ష దివస్ ఉద్యమం ఈ తరం మాత్రమే కాదు, రాబోయే తరాలు కూడా స్మరించుకోవాల్సిన బాధ్యత ఉందని, ఉద్యమానికి కొత్త దిశ ఇచ్చిన మహోన్నత ఘట్టం దీక్ష దివస్ అని బిఆర్ఎస్ మాజీ లోక్సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర సాధన ధ్యేయంతో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన కేసిఆర్, “తెలంగాణ వచ్చుడో కెసిఆర్ సచ్చుడో” అంటూ నినాదంతో 29 నవంబర్ కేసీఆర్ చేపట్టిన దీక్ష దివస్, రాష్ట్ర ప్రజల కలల్ని నిజం చేసిన ప్రజా పోరాట దినంగా నిలిచిపోయిందన్నారు. దశాబ్దాలుగా అందని తెలంగాణ స్వప్నానికి కేసీఆర్ చూపిన అహింసాయుత పోరాట మార్గం తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా అడుగులు వేసిందన్నారు. నిరాహార దీక్షతో కేసీఆర్ ప్రాణాలను పణంగా పెట్టి పోరాటాన్ని ముందుకు నడిపారనే విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో రాత్రింబవళ్లు నాడు పోరాడిన తెలంగాణ విద్యార్థి లోకం, ఉద్యమకారులు, ఉద్యోగులు, అమరులు త్యాగాలు ఎన్నటికీ మరువలేమన్నారు. నేటి తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం, ప్రజల గౌరవ జీవనం అన్నీ ఉద్యమ ఫలితమేనని ఆయన అన్నారు. నేడు తెలంగాణను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని, గతంలో ఎలా పోరాడామో నేడు కూడా అదే స్ఫూర్తి కొనసాగాలని ఆయన పిలుపునిచ్చారు. దీక్ష దినోత్సవం సందర్భంగా ప్రతి బిఆర్ఎస్ కార్యకర్త ఉద్యమ చరిత్రను గుర్తుచేసుకుని, ప్రజల మధ్యకు వెళ్లి దీక్ష ప్రాముఖ్యతను వివరించాలని కోరారు. కేసీఆర్ స్ఫూర్తి, కేటీఆర్ నాయకత్వం, ఉద్యమ నాయకులు శ్రమ ఇవన్నీ కలిసి తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్తాయని నామ విశ్వాసం వ్యక్తం చేశారు. 15వ లోక్సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినపుడు తాను ఎంపీగా ఉండి తెలంగాణ బిడ్డగా ఆ బిల్లు పై తొలి ఓటు వేసానన్నారు. దీక్ష దివస్ సందర్భంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జరిగే కార్యక్రమాల్లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.


Comments