గండి రామారం పంపు హౌస్ ఎత్తిపోతల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
చిల్పూర్, నవంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):
చిల్పూర్ మండలం గండి రామారం గ్రామంలో సాగునీటి సరఫరా కోసం నిర్మిస్తున్న పంపు హౌస్ ఎత్తిపోతల పనులను మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రాజెక్టు వద్ద పనిచేస్తున్న ఇంజనీర్లు, అధికారులతో మాట్లాడి పనుల పురోగతిని సమీక్షించారు. రైతుల సాగు నీటి అవసరాలను తీర్చేలా పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రాజెక్టు పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్ణీత గడువులో పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ...ఈ ఎత్తిపోతల పథకం ద్వారా వేల ఎకరాల భూమికి సాగు నీటి సదుపాయం లభించబోతోందని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తి కావడంతో రైతుల ఆర్థిక స్థితిలో గణనీయమైన మార్పు వస్తుందని చెప్పారు. వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం కృషి కొనసాగిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.


Comments