కార్తీక పౌర్ణమి కీసరగుట్ట ఆలయాన్ని సందర్శించిన రాచకొండ సీపీ
భద్రతా ఏర్పాట్లపై సమీక్ష
కీసర, నవంబర్ 5 (తెలంగాణ ముచ్చట్లు)
కార్తీక పౌర్ణమి పర్వదినం కావడంతో కీసరగుట్ట శ్రీ భవానీ శంకర స్వామి దేవాలయంలో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు, ఐపీఎస్ స్వయంగా పర్యటించారు.ఆలయ ప్రధాన ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు, అడవి మార్గాలు, గోపురం చుట్టుపక్కల ప్రాంతాలను ఆయన సమగ్రంగా పరిశీలించారు. భక్తులు సౌకర్యవంతంగా దర్శనం చేసుకునేందుకు, ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేశారు.సీసీ కెమెరాల పనితీరు, డ్రోన్ పర్యవేక్షణ, క్యూలైన్ మేనేజ్మెంట్, మహిళ భద్రత, ట్రాఫిక్ డైవర్షన్లు, పార్కింగ్ లైన్ల ఏర్పాట్లపై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు రావడం దృష్ట్యా అదనపు పోలీసు బలగాలు, శిక్షణ పొందిన సిబ్బంది, బాంబ్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ ను కూడా మోహరించినట్లు అధికారులు తెలిపారు.భక్తులు సురక్షితంగా, ప్రశాంతంగా పర్వదినాన్ని జరుపుకునేలా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీపీ పేర్కొన్నారు. భక్తుల సహకారంతో వాహనాలను క్రమబద్ధంగా పార్క్ చేయాలని, అనుమతి లేని ప్రాంతాల్లో వాహనాలు నిలిపివేయరాదని సూచించారు.ప్రత్యేక వైద్య బృందాలు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచి అత్యవసర సేవలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో కార్యక్రమాలు చక్కగా కొనసాగుతున్నాయని సీపీ అన్నారు.


Comments