భారత మహిళా జట్టు చరిత్ర సృష్టించింది.
బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు
ఖమ్మం బ్యూరో, నవంబర్ 3, తెలంగాణ ముచ్చట్లు:
భారత మహిళా క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ను తొలిసారిగా కైవసం చేసుకొని దేశ క్రీడా చరిత్రలో సువర్ణపుటలను రాసిందని భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు అన్నారు. ఈ అద్భుత విజయంతో భారత త్రివర్ణ పతాకాన్ని అంతర్జాతీయ వేదికపై గర్వంగా ఎగురవేసిన మహిళా యోధాంగనలకు దేశ ప్రజల తరపున హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానని తెలిపారు.
మహిళలు క్రీడా రంగంలో చూపుతున్న అచంచల ప్రతిభ దేశ గౌరవాన్ని మరింత ఎత్తుకు చేర్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ విజయం భారత మహిళా శక్తి సామర్థ్యానికి ప్రతీకగా నిలిచిందని, ప్రపంచానికి స్ఫూర్తినిచ్చే ఘనత సాధించిందని ప్రశంసించారు.
టోర్నీలో ప్రారంభ దశలో వరుసగా మూడు పరాజయాలను ఎదుర్కొన్నప్పటికీ, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ధైర్యంగా పోరాడి చివరికి విజేతలుగా నిలిచిన ఈ జట్టు నిజమైన యోధుల బృందమని కొనియాడారు. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై రికార్డు స్థాయిలో రన్స్ ఛేదన చేసి వారిని ఓడించడం, ఫైనల్లో దక్షిణాఫ్రికాపై సమిష్టి కృషితో సాధించిన ఘనత చరిత్రలో చిరస్మరణీయమని తెలిపారు.
దేశ యువతకు ఈ విజయం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొంటూ, భవిష్యత్తులో కూడా అంతర్జాతీయ వేదికపై భారత జెండాను మరెన్నో సార్లు ఎగురవేయాలని ఆకాంక్షించారు. ఈ విజయానికి వెనుక ఉన్న కోచ్, మేనేజ్మెంట్, సపోర్ట్ స్టాఫ్ అందరికీ కూడా ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
మహిళా శక్తి క్రీడా రంగంలో సింహస్వప్నాన్ని సాకారం చేసిన ఈ విజయం, దేశవ్యాప్తంగా ప్రతి భారతీయుని గుండెల్లో గర్వాన్ని నింపిందని నెల్లూరి కోటేశ్వరరావు పేర్కొన్నారు.


Comments