నాగారం నూతన మద్యం దుకాణం పై జంట వాదాలు
మహిళల ఆందోళన – యాజమాన్య ధృఢ నిర్ణయం
నాగారం, నవంబర్ 2 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని సత్యనారాయణ కాలనీ వద్ద నూతన మద్యం దుకాణం ఏర్పాటు పై స్థానిక మహిళలు, కాలనీ వాసులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. నాగారం–రాంపల్లి మెయిన్ రోడ్ వై జంక్షన్ వద్ద, రోడ్ నంబర్ 1,2 ప్రాంతంలో ఏర్పాటు కానున్న ఈ మద్యం దుకాణం కారణంగా కాలనీ వాతావరణం దెబ్బతింటుందని, చిన్నపిల్లల దవాఖాన, కృష్ణవేణి స్కూల్ సమీపంలో ఉన్నందున భవిష్యత్తులో అక్రమాలు, అసాంఘిక చర్యలు పెరగవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేశారు.సుమారు 400కి పైగా కుటుంబాలు నివసించే ఈ ప్రాంతంలో మద్యం షాపు ఏర్పాటు చేయరాదని వాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నాగారం మున్సిపాలిటీ కమిషనర్ మరియు ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రాలు సమర్పించినట్లు తెలిపారు. శుక్రవారం మార్కెట్ ప్రాంతం కావడం వల్ల రద్దీ అధికంగా ఉండే ఈ ప్రాంతంలో మద్యం దుకాణం మంజూరు చేయడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని వాసులు పేర్కొన్నారు.
ప్రభుత్వ నిబంధనలతోనే ముందుకు: యాజమాన్యం
ఈ సందర్భంగా నూతన మద్యం దుకాణ యాజమానులు పవన్ రెడ్డి, జీవన్ రెడ్డి మాట్లాడుతూ—
"ప్రభుత్వ నిబంధనల మేరకు, పూర్తి అధికారిక అనుమతులతోనే మద్యం దుకాణం ఏర్పాటు చేస్తున్నాము. ఇంతకుముందు ఇదే రోడ్డులో దుకాణం నడిచినట్లే, ప్రభుత్వం నిర్ణయించిన మార్గదర్శకాల ప్రకారం కొత్త షాపు నడపబడుతుంది" అని తెలిపారు.నిరసన నేపథ్యంలో కీసర పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. మద్యం దుకాణం ప్రారంభానికి ఇంకా ఒక నెల సమయం ఉండగా, ఇరు వర్గాలు ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు పాటించాలని సంబంధిత పోలీసు అధికారులు సూచించినట్లు సమాచారం.
కాలనీవాసుల ఆందోళన Vs యాజమాన్య నిశ్చయం
మద్యం దుకాణం ఏర్పాటుపై ప్రాంతీయ మహిళలు, వాసుల్లో ఆగ్రహం పెరుగుతుండగా, యాజమాన్యం ప్రభుత్వ అనుమతుల ఆధారంగా ముందుకు సాగుతామని స్పష్టం చేస్తోంది. ఈ వ్యవహారం పై వచ్చే రోజుల్లో మరింత చర్చ జరగే అవకాశముంది.


Comments