వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య
ఎన్డీఆర్ఎఫ్ బోటులో లోతట్టు ప్రాంతాలకు ఎంపీ
– ప్రజలకు ఆహారం, త్రాగునీరు, పాలప్యాకెట్లు అందజేత
-వరద ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పంపిణీ జరుగుతున్న సహాయక చర్యలను పరిశీలన
ప్రజలకు ధైర్యం చెబుతూ,శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని హామీ
హనుమకొండ,అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):
మొంథా తుఫాను కారణంగా హనుమకొండ నగరంలో ఏర్పడిన వరద ప్రభావిత ప్రాంతాలను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య స్వయంగా పర్యటించారు. గోపాలపురం, టీఎన్జీవోస్ కాలనీ వంటి లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయిన నేపథ్యంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిరంతరంగా పర్యటిస్తూ పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు.గోపాలపురంలో వరద ఉధృతి తీవ్రతను గమనించిన ఎంపీ, వెంటనే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి బోటులో ప్రయాణిస్తూ నీట మునిగిన ప్రాంతాలకు చేరుకున్న ఆమె, ప్రజలతో మాట్లాడారు. ఇళ్లలో చిక్కుకున్న కుటుంబాలకు స్వయంగా పాల ప్యాకెట్లు, త్రాగునీరు, ఆహార ప్యాకెట్లు అందజేశారు. ప్రజలకు ధైర్యం చెబుతూ ప్రభుత్వం వారి పక్కనే ఉందని భరోసా ఇచ్చారు.
బీఆర్ నగర్ కాలనీలో డ్రోన్ల ద్వారా ఆహారం, తాగునీరు పంపిణీ జరుగుతున్న విధానాన్ని మంత్రి కొండ సురేఖ, కలెక్టర్ డాక్టర్ సత్య శారదలతో కలిసి ఎంపీ డాక్టర్ కడియం కావ్య పరిశీలించారు. ప్రతి కుటుంబానికి సహాయం వేగంగా చేరేలా అధికారులకు సూచనలు చేశారు. ప్రజలు ఆందోళన చెందకుండా అన్ని రకాల సహాయక చర్యలు నిరంతరంగా కొనసాగుతాయని తెలిపారు.
వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు తాత్కాలిక ఉపశమనంతో పాటు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎంపీ స్పష్టం చేశారు. “ప్రతి ఇల్లు సురక్షితంగా ఉండే వరకు మేము పక్కనే ఉంటాం,” అని ఎంపీ డాక్టర్ కడియం కావ్య పేర్కొన్నారు.




Comments