నవంబర్ 3లోగా పోస్ట్ మెట్రిక్ దరఖాస్తులలో తలెత్తిన సమస్యలు పరిష్కరించాలి..
జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి జ్యోతి
ఖమ్మం బ్యూరో, నవంబర్ -1, తెలంగాణ ముచ్చట్లు;
నవంబర్ 3 లోగా పోస్ట్ మెట్రిక్ దరఖాస్తులలో తలెత్తిన సమస్యలు పరిష్కరించాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారిణి జి. జ్యోతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే ఎస్సీ విద్యార్థిని, విద్యార్ధులకు 2024-25 విద్యా సంవత్సరానికి గాను పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు మంజూరులో తలెత్తుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించ వలసిందిగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.
ఆధార్ నంబరు బ్యాంకు ఖాతాకు లింక్ లేకపోవడం, కాలేజీలో ఫస్ట్ లెవెల్ వెరిఫికేషన్ పూర్తికాని దరఖాస్తులు ఇంకా ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ డిజిటల్ కి ద్వారా ఫార్వర్డ్ చేయని దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు అన్నారు. సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించి, అన్ని పెండింగ్ దరఖాస్తులను నిర్ణీత గడువులోగా ఈ పాస్ పోర్టల్ లో పూర్తి చేయాలని, ఈ ప్రక్రియ మొత్తం నవంబర్ 3 వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్ధులు తమ ప్రస్తుత బ్యాంకు ఖాతాలో ఆధార్ సీడింగ్ సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే, వారికి పోస్టాఫీస్ లో కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయమని సూచించాలని, పోస్టాఫీస్ అకౌంట్ ఆధార్ లింక్ అయిన తర్వాత, ఆ వివరాలు ఈ- పాస్ పోర్టల్ లో ఆటోమేటిక్ గా అప్ డేట్ అవుతాయని, కాబట్టి విద్యార్థులు వెబ్ సైట్ లో స్వయంగా అప్ డేట్ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. జిల్లాలోని అన్ని కళాశాలల ప్రిన్సిపాల్ లు పెండింగ్ దరఖాస్తులను నిర్ణీత గడువులోగా జిల్లా కార్యాలయానికి డిజిటల్ కీ ద్వారా సమర్పించాలని, ఈ విషయంలో ఏవైనా నిర్లక్ష్యం, అనాసక్తి లేదా ఆలస్యం జరిగితే, సంబంధిత ప్రిన్సిపాల్ విద్యార్ధుల స్కాలర్షిప్ మంజూరులో ఆలస్యం లేదా తిరస్కరణకు వ్యక్తిగతంగా బాధ్యత వహించవలసి ఉంటుందని జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారిణి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


Comments