పంటలను పరిశీలించిన సిపిఐ బృందం
తుపాను ప్రభావంతో వేలాది ఎకరాల్లో పంట నష్టం
– జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్
-హనుమకొండ జిల్లా సిపిఐ కార్యదర్శి కర్రె.బిక్షపతి
ఎల్కతుర్తి. అక్టోబర్ 30( తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా వ్యాప్తంగా తుపాను ప్రభావంతో రైతాంగం తీవ్ర నష్టాన్ని చవిచూస్తోందని సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి, కంది, చిరుధాన్యాలు దెబ్బతిన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఎల్కతుర్తి మండలంలోని గోపాలపూర్ గ్రామంలో ఊట్కూరి ప్రభాకర్కు చెందిన కోళ్ల ఫార్మ్లో నీరు చేరి దాదాపు రూ.3 లక్షల విలువైన కోడి పిల్లలు చనిపోయాయి. అదేవిధంగా పెండ్యాల సాంబయ్యకు చెందిన రెండు ఎకరాల వరి నేలకొరిగింది. పోలేని శ్రీనివాసరావు వరి పొలాలు నీటమునిగాయి. పెండ్యాల నాగరాజుకు చెందిన మూడు లెగ దూడలు తాళ్లవాగులో కొట్టుకుపోయాయి. అలాగే బావుపేటకు చెందిన పోలాటి సంపత్ రావు 150 వరి బస్తాలు ప్రవాహ జలాలతో కొట్టుకుపోయాయని ఆయన వివరించారు.
“ఇలాంటివి జిల్లాలో ఎన్నో చోట్ల చోటుచేసుకున్నాయి. రైతులు అపారమైన నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ తుపాను రాష్ట్రాన్ని నిండుగా ముంచింది. ప్రభుత్వం దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి, రైతులకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలి” అని కర్రె బిక్షపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్శనలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కర్రె లక్ష్మణ్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వుట్కూరి రాములు, దళిత హక్కుల పోరాట సంఘం జిల్లా అధ్యక్షుడు నిమ్మల మనోహర్, సిపిఐ గ్రామ కార్యదర్శి సూర మొగిలి, సహాయ కార్యదర్శులుజూపాక రవీందర్, కర్రె రాజు, రైతు నాయకులు కోదాటి రాజేశ్వరరావు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.


Comments