రక్తదానంతో మరో ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చు
పోలీస్ కమీషనర్ సన్ప్రీత్ సింగ్
హనుమకొండ,అక్టోబర్23(తెలంగాణ ముచ్చట్లు): రక్తదానం చేయడం ద్వారామరో ముగ్గురు ప్రాణాలను కాపాడవచ్చని వరంగల్ పోలీసు కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని కాజీపేట డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో మడికొండలోని కళ్యాణ మండపంలో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని సీపీ ప్రారంభించి రక్తదాతలను అభినందించారు.
శిబిరంలో పోలీసు అధికారులు, సిబ్బంది, స్థానిక యువత, వ్యాపారవేత్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదాతలకు సీపీ సర్టిఫికెట్లు, పండ్లు అందజేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ — “పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ రక్తదానానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు. రక్తదానం ఒక మహత్తర సేవ. ఇది ఇతరుల ప్రాణాలను కాపాడే మానవతా కర్తవ్యం” అని పేర్కొన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా సన్ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అంకిత్ కుమార్, కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, మడికొండ ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్, రాష్ట్ర రెడ్క్రాస్ పాలక సభ్యుడు ఇవి శ్రీనివాస్, వైద్యులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Comments