దమ్మాయిగూడ అణుశక్తి నగర్ వాటర్ ట్యాంక్ రోడ్ మూసివేత
సిద్దార్థ కాలనీ వాసులకు రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు
దమ్మాయిగూడ, నవంబర్ 5 (తెలంగాణ ముచ్చట్లు)
దమ్మాయిగూడ అణుశక్తి నగర్ వాటర్ ట్యాంక్ నుండి సిద్దార్థ కాలనీకి వెళ్లే ప్రధాన మార్గాన్ని కొందరు వ్యక్తులు అక్రమంగా మూసివేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్య రహదారి బ్లాక్ కావడంతో కాలనీవాసులు వందల మీటర్లు అదనంగా తిరిగి మెయిన్ రోడ్ ద్వారా మాత్రమే రాకపోకలు నిర్వహించాల్సి వస్తోంది.కాలనీవాసులు మాట్లాడుతూ, పిల్లలు స్కూల్కు వెళ్లడం, వృద్ధులు ఆసుపత్రులకు చేరడం, ఉద్యోగులకు ప్రతిరోజూ కార్యాలయాలకు చేరడంలో తీవ్ర అంతరాయం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా రహదారిని వ్యక్తిగత ప్రయోజనాల కోసం మూసివేయడానికి ఎవరికి అధికారం లేదని వాసులు స్పష్టం చేశారు.గత కొన్నేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధుల ను పలుమార్లు వినతిపత్రాల తో సంప్రదించినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో, కాలనీలో ఇటీవల ప్రారంభమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు మధ్యలోనే నిలిచిపోయి రహదారి మరింత దారుణ స్థితికి చేరుకున్నట్లు వాసులు తెలిపారు. మట్టి, గుంతలు, రాకపోకలకు ఇబ్బందులతో జనజీవనం స్థంభించిపోయే పరిస్థితి నెలకొంది.ప్రజల ప్రయాణ హక్కులకు భంగం కలిగిస్తూ రహదారిని మూసివేయడాన్ని వెంటనే నిలిపివేసి, డ్రైనేజ్ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను కాలనీవాసులు డిమాండ్ చేశారు.


Comments