పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధే నా ధ్యేయం
మామునూరు ఎయిర్పోర్ట్ పనులు వేగవంతం చేయాలి
– ఎంపీ డా. కడియం కావ్య
జిల్లా కలెక్టర్తో సమావేశమైన వరంగల్ ఎంపీ
వరంగల్,అక్టోబర్24(తెలంగాణ ముచ్చట్లు):
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధే తన ధ్యేయమని ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం కలెక్టర్ సత్య శారదతో ఆమె సమావేశమై జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర నిధుల వినియోగం, ప్రత్యేక ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కేంద్రం నుంచి మంజూరైన పలు స్కీములు, ప్రజాప్రయోజన కార్యక్రమాల అమలుపై వివరాలు తెలుసుకున్నారు. జిల్లాలో జరుగుతున్న కీలక ప్రాజెక్టులు వేగంగా పూర్తి కావాల్సిన అవసరాన్ని ఎంపీ స్పష్టంచేశారు.
మామునూరు ఎయిర్పోర్టు విస్తరణకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆమె సూచించారు. మెగా టెక్స్టైల్ పార్క్కు కేంద్రం కేటాయించిన PM మిత్ర నిధుల వినియోగం, ప్రాజెక్ట్ పురోగతి అంశాలపై ఎంపీ సమీక్షించారు. గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ను ఆదేశించారు.
అదే విధంగా కాకతీయుల చారిత్రక వారసత్వ సంపద రక్షణ, జిల్లా పురావస్తు పరిశోధన కేంద్రం అభివృద్ధి దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. వరంగల్ పర్యాటక రంగాన్ని విస్తరించడానికి పలు ఆలయాలను ప్రసాద్ స్కీమ్ కింద అభివృద్ధి చేసేందుకు కేంద్ర పర్యాటక శాఖతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.
గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ఆడపిల్లల ఆరోగ్యం, భద్రత అంశాలపై ఎంపీ ప్రత్యేక దృష్టి సారించారు. విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు, కౌన్సెలింగ్ తరచుగా నిర్వహించాలని సూచించారు.“వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి కేంద్రం నుంచి అదనపు నిధులు సమీకరించేందుకు కృషి చేస్తాను. జిల్లాలోని ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించి గళం వినిపిస్తాను. వరంగల్ను జాతీయ స్థాయిలో ముందుకు తీసుకెళ్లడమే నా లక్ష్యం” అని ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు.


Comments