తీగల వంతెన నిర్మాణ పనులు వేగవంతం చేయాలి...
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం బ్యూరో, అక్టోబర్ -24, తెలంగాణ ముచ్చట్లు;
ఖమ్మం మున్నేరు నదిపై చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ పూర్తి చేయడం పట్ల అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
శుక్రవారం నగరంలో జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణం, కాల్వొడ్డు తీగల వంతెన పనులు, మున్నేరు భూనిర్వాసితుల కోసం ఏర్పాటు చేస్తున్న లేఔట్ వెంచర్ పురోగతి పనులను క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం రిటైనింగ్ వాల్ భూనిర్వాసితులకు ఇచ్చే ప్రత్యామ్నాయ భూమి లేఔట్ అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ నిపుణుల కమిటీ చేసిన డిజైన్ ల ప్రకారం మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణం పక్కాగా జరగాలని, సకాలంలో పూర్తయ్యేలా చూడాలని అన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రింద సేకరించిన భూములను అభివృద్ధి చేసి మున్నేరు నది రిటైనింగ్ వాల్ భూ నిర్వాసితులకు అందించేలా రైతులతో చర్చలు జరపాలని తెలిపారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి స్థాయిలో నిర్మించాలని, రెండు వైపుల నుంచి ప్రణాళికాబద్ధంగా పని జరగాలని అన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రాధాన్యతతో పూర్తి చేయాలని, ఏజెన్సీ అదనపు బృందాలు ఏర్పాటు చేసి పనులు చేయాలని అన్నారు.
మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ నిమిత్తం రైతులకు, నిర్వాసితులకుఅందించే 125 ఎకరాల ప్రత్యామ్నాయ భూముల లేఔట్ వెంచర్ అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, వెంచర్ కు 100 మీటర్ల ప్రధాన రహదారి, 40 మీటర్ల చొప్పున అంతర్గత రహదారి, నగరంకు సులుభతరం చేసే విధంగా అదనంగా ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, ప్రత్యేకంగా కల్పించే వసతులతో ఒక ప్రత్యేక వెంచర్ తో భూమి విలువ పెరిగి చుట్టు ప్రక్కల విస్తృతంగా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ప్రజలకు అందించే భూములలో లేఔట్ అభివృద్ధి అంతర్గత రోడ్లు, కనెక్టివిటీ అంశాలు ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించాలని అన్నారు. ఖమ్మం నగరంలో మున్నేరుపై నిర్మించే కేబుల్ బ్రిడ్జి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, నిర్ణీత గడుపు లోపు ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చే విధంగా నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని అన్నారు. తీగల వంతెన నిర్మాణం వల్ల ఎవరు కూడా నష్ట పోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఆర్&బీ ఎస్ఇ యాకుబ్, ఇఇ పవార్, ఆర్డీఓ నరసింహారావు, ఇరిగేషన్ డిఇ రమేష్ రెడ్డి, ఖమ్మం అర్బన్, రూరల్ మండల తహసీల్దార్లు సైదులు, రాంప్రసాద్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Comments