లాల్ బహుదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే
వనపర్తి,జనవరి11(తెలంగాణ ముచ్చట్లు):
జై జవాన్–జై కిసాన్ నినాదకర్త, స్వాతంత్ర సమరయోధుడు లాల్ బహుదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వనపర్తి పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. నిరాడంబరతకు ప్రతీక అయిన లాల్ బహుదూర్ శాస్త్రి స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొని సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో భాగస్వామ్యమై ఎన్నోసార్లు జైలు శిక్ష అనుభవించారని గుర్తు చేశారు. తెల్ల విప్లవానికి శ్రీకారం చుట్టి, హరిత విప్లవానికి బాటలు వేసిన మహానేతగా శాస్త్రి దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని అన్నారు.ఇండో–పాకిస్తాన్ యుద్ధ సమయంలో జై జవాన్–జై కిసాన్అనే నినాదంతో సైనికుల్లో ధైర్యాన్ని, రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిన నాయకుడిగా లాల్ బహుదూర్ శాస్త్రి మనందరికీ ఆదర్శమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, జిల్లా దిశా కమిటీ సభ్యురాలు ధనలక్ష్మి, తిరుపతయ్య గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి. కృష్ణ, పట్టణ మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Comments