సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు
తెలుగు సంప్రదాయాల ప్రతిబింబంగా జమ్మిగడ్డలో రంగవల్లుల ముగ్గులు
ఏ.ఎస్.రావు నగర్, జనవరి 11 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం డా, ఏ.ఎస్.రావు నగర్ డివిజన్ పరిధిలోని జమ్మిగడ్డ ప్రాంతం లో మాజీ కార్పొరేటర్ పజ్జురి పావని మణిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా సాగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సంక్షేమ రైతు కమిషన్ సభ్యురాలు మరికంటి భవాని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ముగ్గుల పోటీలతో జమ్మిగడ్డ ప్రాంతం రంగుల మయంగా మారింది. పరిసర కాలనీలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనగా, మొత్తం 156 మంది తమ ప్రతిభను ప్రదర్శించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేసిన రంగవల్లుల ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సామాజిక అంశాలతో కూడిన ముగ్గులు ఎక్కువగా ఉండటంతో విజేతల ఎంపిక కమిటీకి కష్టతరంగా మారిందని నిర్వాహకులు తెలిపారు.పోటీల్లో సింగం నిహారిక ప్రధమ బహుమతి, ప్రియాంక ద్వితీయ బహుమతి, లిఖిత తృతీయ బహుమతి సాధించారు. విజేతలకు ముఖ్య అతిథి మరికంటి భవాని రెడ్డి, పావని మణిపాల్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా మరికంటి భవాని రెడ్డి మాట్లాడుతూ, సంక్రాంతి తెలుగు ప్రజలకు అత్యంత ప్రాముఖ్యమైన పండుగ అని పేర్కొన్నారు. ధనుర్మాసంలో ప్రజలు ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకుంటారని, మహిళలు పిండి వంటలు చేస్తూ, పురుషులు మరియు పిల్లలు పతంగులు ఎగురవేస్తూ సంబరాలు చేసుకుంటారని తెలిపారు.పావని మణిపాల్ రెడ్డి మాట్లాడుతూ, తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడడంతో పాటు మహిళల్లో పోటీ తత్వాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ ముగ్గుల పోటీలను నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.


Comments