వర్షిని కుటుంబాన్ని పరామర్శించిన ఐద్వా
బాధ్యులైన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలి
మల్కాజిగిరి, జనవరి 11 (తెలంగాణ ముచ్చట్లు):
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కమిటీ సభ్యులు వర్షిని కుటుంబాన్ని పరామర్శించి, మృతికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా ఐద్వా మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. వినోద మాట్లాడుతూ… ఈస్ట్ మారేడుపల్లి లోని డాక్టర్ మునగ రామ్ మోహన్ రావు గర్ల్స్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో వర్షిని పరీక్షకు ఆలస్యంగా రావడంతో ఇంగ్లీష్ లెక్చరర్ ఆమెను తరగతి బయట నిలబెట్టిందన్నారు. పీరియడ్స్ కారణంగా ఆరోగ్యం బాగోలేదని వర్షిని చెప్పినప్పటికీ, పీరియడ్స్ విప్పి చూపించాలని అడగడం అత్యంత దారుణమని, ఇది అమ్మాయిని తీవ్ర మానసిక వేదనకు గురి చేసిందన్నారు.వర్షిని తండ్రి కార్పెంటర్ పని కొంతకాలం నిలిపివేయడంతో, ఆ విషయాన్ని కారణంగా చూపిస్తూ ఆ టీచర్ తరచూ వర్షినిని లక్ష్యంగా చేసుకుని వేధించిందని ఆరోపించారు. ఒక మహిళ, తల్లి స్థాయిలో ఉండాల్సిన ఉపాధ్యాయురాలు ఇలా ప్రవర్తించడం సమాజానికే సిగ్గుచేటని ఐద్వా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.పరీక్ష అనంతరం ఇంటికి వెళ్లిన వర్షిని తలనొప్పి ఉందని తల్లికి చెప్పడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా, ఎంఆర్ఐ స్కాన్ నిర్వహించి ఐసీయూలో చికిత్స అందించినా, తీవ్రమైన మానసిక ఒత్తిడితో మెదడులో రక్తం గడ్డకట్టడంతో (బ్రెయిన్ బ్లడ్ క్లాట్) ఆమె మృతి చెందినట్లు తెలిపారు.ఈ ఘటనతో తల్లిదండ్రులకు తీరని దుఃఖం మిగిలిందని పేర్కొన్న ఐద్వా నాయకులు… వర్షిని కుటుంబానికి ప్రభుత్వం రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే వర్షిని మృతికి కారణమైన ఇంగ్లీష్ లెక్చరర్ మాధురి, ఫిజిక్స్ లెక్చరర్ శ్రీలక్ష్మిపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు బి. మీనా కుమారి, మల్కాజిగిరి మండల ప్రధాన కార్యదర్శి పి. మంగ, ఐద్వా నాయకులు నసీమా, సిహెచ్. విజయలక్ష్మీ, పి. అరుణ తదితరులు పాల్గొన్నారు.


Comments