కట్ట మైసమ్మ గుడి ఘటనతో నేరేడ్మెట్లో ఉద్రిక్తత
_నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
_గుడి వద్దకు చేరుకున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు
మల్కాజిగిరి, జనవరి 11 (తెలంగాణ ముచ్చట్లు):
మల్కాజిగిరి నియోజకవర్గంనేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సఫిల్గూడలో ఉన్న కట్ట మైసమ్మ దేవాలయంలో చోటుచేసుకున్న అపవిత్ర ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
నిన్న రాత్రి దేవాలయం వద్ద ఉన్న బొడ్రాయిపై ఓ అగంతకుడు అమ్మవారి విగ్రహం ముందు మల–మూత్ర విసర్జన చేసినట్లు స్థానికులు గుర్తించారు.ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. విషయం తెలిసిన వెంటనే పెద్ద సంఖ్యలో ప్రజలు గుడి వద్దకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు నేరేడ్మెట్ పోలీసులు భారీగా బలగాలను మోహరించి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు కట్ట మైసమ్మ గుడి వద్దకు చేరుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,“హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి” అని డిమాండ్ చేశారు.ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో గుడి పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.


Comments