వేడుకల్లో మార్పు… సేవా కార్యక్రమాలకు పిలుపు.!
- డబ్బులు వృథా చేయకుండా చిన్నారుల భవిష్యత్తుకు చేయూత.
- ఎమ్మెల్యే మట్టా రాగమయి.
సత్తుపల్లి, డిసెంబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):
జనవరి 1 నూతన సంవత్సరం సందర్భంగా, అలాగే జనవరి 3, 2026 నాడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించే శుభాకాంక్షల కార్యక్రమాలకు సేవా రూపం ఇవ్వాలని సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎటువంటి శాలువాలు, బొకేలు, స్వీట్స్, కేకులు తీసుకురావద్దని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం తెలిపింది. వాటి బదులు పేద కుటుంబాల పిల్లలకు ఉపయోగపడే వస్తువులు అందించాలని విజ్ఞప్తి చేసింది.
బడి పిల్లలకు అవసరమైన పెన్నులు, నోట్బుక్స్, బ్యాగులు, దుప్పట్లు, ప్లేట్లు, విజ్ఞానం పెంపొందించే పుస్తకాలు, కంపాస్ బాక్సులు, గ్లాసులు, వాటర్ బాటిల్స్ వంటి వస్తువులను తమ ఆర్థిక పరిస్థితిని బట్టి జనవరి 1 మరియు జనవరి 3 తేదీల్లో అందజేయాలని సూచించారు.
డబ్బులు వృథా కాకుండా, ఆర్థికంగా వెనుకబడిన చిన్నారులకు మేలు చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, ఉద్యోగులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.


Comments