దేశంలో ఎక్కడ జరగని కుమ్మక్కు రాజకీయం తెలంగాణలో కొనసాగుతోంది
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శ
హైదరాబాద్, తెలంగాణ ముచ్చట్లు
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ మరియు కేంద్రంలో ఉన్న బీజేపీ మధ్య కుమ్మక్కు రాజకీయాలు బహిర్గతమవుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిదికి ₹1137 కోట్ల అమృత్ ప్రాజెక్టు కాంట్రాక్టు, అదే సమయంలో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్కు రాష్ట్ర ప్రభుత్వం ₹1660 కోట్ల రోడ్ కాంట్రాక్టు మంజూరు చేయడం దుశాసన పాలనకు నిదర్శనమని కేటీఆర్ ఆరోపించారు.ఈ రెండు భారీ కాంట్రాక్టుల వెనక ఒకరినొకరు ఆదుకునే రాజకీయ కుట్ర ఉందని, ఈ నిజాలను బహిర్గతం చేసిన తామిని లక్ష్యంగా చేసుకొని ఇద్దరూ పరస్పరం విమర్శలు చేసుకుంటూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
“లేని ఫ్యూచర్ సిటీకి రోడ్డు కట్టుతామంటూ 1660 కోట్ల కాంట్రాక్టు ఇచ్చారు. హెచ్సీయూ భూములను తాకట్టు పెట్టి 10 వేల కోట్ల స్కాం చేసిన దొంగలకు రోడ్డు పేరిట రివార్డు ఇచ్చారు. నేను అప్పుడే చెప్పిన దొంగతనాలు ఇప్పుడు రుజువవుతున్నాయి. ఈ స్కాంలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీలో విలీనం అనే పసలేని విషయాన్ని తెరపైకి తెస్తున్నారు,” అని విమర్శించారు.
రూల్స్ను అతిక్రమించి, ముందే నిర్ణయించుకున్న వ్యక్తులకు కాంట్రాక్టులు కట్టబెట్టడంలో సీఎం రేవంత్ రెడ్డికి అనుభవముందని, ఆయన సహకరించినందుకే బీజేపీ ఎంపీ సీఎం రమేశ్కు భారీ కాంట్రాక్టు దక్కిందని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో కేటీఆర్ ఓ సవాల్ విసిరారు “హెచ్ సియూ 10 వేల కోట్ల స్కాం, 1660 కోట్ల రోడ్ కాంట్రాక్టు స్కాం… ఈ రెండింటిపైనా ఓ బహిరంగ చర్చకు సిద్ధమా?”
తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఏర్పడిన పార్టీగా బీఆర్ఎస్ తమ పాత్రను గుర్తు చేస్తూ, “ఏ పార్టీలో విలీనమయ్యే ప్రసక్తే లేదు” అని స్పష్టం చేసింది. కాంగ్రెస్,బీజేపీలు కలిసి చేసే కుట్రలను ప్రజలు గుర్తించి తగిన సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు.
Comments