పి.బి. చారి రచనపై శాస్త్రీయ చర్చలు
మేడ్చల్–మల్కాజిగిరి, నవంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు) :
అంతర్జాతీయ ఎవల్యూషన్ డే సందర్భంగా తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 11 గంటలకు కమలానగర్ ఆఫీసులో ప్రముఖ విజ్ఞానవేత్త పి.బి.చారి రచించిన “విశ్వం జీవం మానవుడు” పుస్తకంపై స్టడీ సర్కిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు సమన్వయకర్తగా వ్యవహరించారు.ప్రముఖ సామాజిక ఉద్యమ నేత జయరాజు డార్విన్ ప్రతిపాదించిన ఎవల్యూషన్ సిద్ధాంతం, విశ్వం–జీవం–మానవుడి పరిణామ క్రమాన్ని సవివరంగా వివరిస్తూ, పి.బి.చారి రచనలో ప్రతిఫలించిన శాస్త్రీయ దృక్పథాన్ని ప్రశంసించారు. ఆవిర్భావం నుంచి నేచురల్ సెలెక్షన్ వరకూ కోట్ల సంవత్సరాల పరిణామ క్రమంలోనే మానవ మనుగడ సాధ్యమైందని, మతాలు చెబుతున్నట్లుగా మనిషి అకస్మాత్తుగా పుట్టలేదని స్పష్టం చేశారు.ఈ పుస్తకానికి ప్రముఖ విజ్ఞానవేత్త దేవరాజు మహారాజు ముందుమాట రాసిన విషయాన్ని గుర్తుచేస్తూ, విజ్ఞానవేత్త టి.రమేష్ పుస్తకంలోని శాస్త్రీయ అంశాలను పాల్గొన్నవారికి వివరించారు. విశ్వం ఏర్పడటానికి కారణమైన మహావిస్ఫోటనం, అనంతరం ఏర్పడిన పాలపుంతలు, నక్షత్ర సముదాయాలు, సూర్యుడు మరియు దాని ఉపగ్రహాల పరిణామం తదితర అంశాలను పుస్తక ఉదాహరణలతో చర్చించారు.
ఎం.భాస్కర్రావు మాట్లాడుతూ, నేటి పాలకులు శాస్త్రవిజ్ఞానాన్ని మూఢనమ్మకాలతో మేళవించి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. మూఢనమ్మకాలు, అశాస్త్రీయ పోకడలను వదిలి శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రుక్కయ్య, శారద, పార్థసారథి, శశాంక్లు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
అధ్యక్షులు గొడుగు యాదగిరిరావు మాట్లాడుతూ, మానవ పరిణామ క్రమంలో మనుషులందరూ ఆఫ్రికా ఖండంలో ఉన్న ఒక తల్లి సంతానంగా అభివృద్ధి చెందినట్టు పి.బి.చారి పుస్తకంలో వివరించారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎం.శ్రీనివాసరావు, గౌసియా, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, శారద, శశాంక్, రుక్కయ్య, పార్థసారథి, భాస్కర్రావు, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


Comments