పాత, కొత్త తేడా లేదు... అందరినీ కలుపుకుపోతాం
--- రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని డివిజన్లను గెలుచుకుంటాం
--- పనిచేసే వారందరికీ పార్టీలో సముచిత స్థానం
--- ఖమ్మం ప్రెస్ క్లబ్ 'మీట్ ది ప్రెస్' లో సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 9, (తెలంగాణ ముచ్చట్లు)
పాత కొత్త అనేది ఏమీ లేదు. పార్టీలో ఉన్న వారందరినీ కలుపుకు పోతాం. సమన్వయంతో పని చేస్తాం. రాబోయే కాలంలో ఖమ్మం నగరంలో కాంగ్రెస్ పార్టీని మహోన్నత శక్తిగా తయారు చేస్తామని సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి పేర్కొన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్- టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ' మీట్ ద ప్రెస్ ' కార్యక్రమంలో దీపక్ చౌదరి పలువురు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు మీ వ్యూహం ఏమిటి..?
--- కాంగ్రెస్ నాయకులందరినీ కలుపుకుపోయి సమన్వయంతో పని చేస్తా. ఇప్పటికే నేను సిటీ అధ్యక్షులుగా నియమితులైన దగ్గర నుండి నగరంలో పాతతరం కాంగ్రెస్ కార్యకర్తలను నాయకులను, కొత్తతరం నాయకులను అందరినీ కలుస్తూ పార్టీ ఎదుగుదల గురించి చర్చించడం జరిగింది. కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నాను. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకుపోతాం.... రాపోయే కార్పొరేషన్ ఎన్నికల్లో 100% ఫలితాలను సాధిస్తాం.
ఖమ్మం నగర పరిధిలో నామినేటెడ్ పోస్టుల భర్తీ కి చర్యలు..?
ఇది నా పరిధిలోనిది కాదు అయినా పార్టీ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తాను.
నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది ఎలా అధిగమిస్తారు..?
ఇది కూడా నా పరిధిలోనిది కాదు పెరుగుతున్న జనాభా నేపధ్యంలో ట్రాఫిక్ సమస్య కూడా పెరుగుతోంది. ఈ సమస్యను కూడా ఇటు అధికారులు అటు మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తా.
ఇందిరమ్మ ఇండ్లకు డబ్బులు వసూలు చేశారని విమర్శలు ఉన్నాయి..? ఇంకా కొంతమంది అర్హులకు ఇండ్లు రాలేదు. దీనిపై మీ కామెంట్..?
ఇందిరమ్మ ఇండ్లకు డబ్బులు వసూలు చేశారనేది అవాస్తవం. విడతలవారీగా అందరికీ ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. ఇది ఒక విడతతో ఆగే పథకం కాదు. ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇండ్లు ఇవ్వాలనేది గొప్ప సంకల్పంతో పని చేస్తోంది. కావున అర్హులైన పేదలందరికీ ఇండ్లు వస్తాయి. ఆందోళన చెందవద్దు.
ఖమ్మం నగరంలోని దేవాలయ కమిటీలలో అధికార పార్టీ నాయకులకే నామినేటెడ్ పదవులు ఇస్తారా..? లేదా అనాదిగా దేవాలయంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారికి ప్రాముఖ్యతను ఇస్తారా..?
ప్రభుత్వం నామినేటెడ్ పదవులకు కసరత్తు చేస్తోంది.. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. తప్పకుండా పని చేసే వారికి న్యాయం జరుగుతుంది.
నగర కమిటీ పూర్తిస్థాయి నియామకం ఎప్పుడూ ఉంటుంది..?
నేనింకా ప్రమాణ స్వీకారమే చేయలేదు. అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. రఘునాధపాలెం మండలంలో ప్రచారం చేస్తున్నాను... త్వరలోనే పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది.
నగర అభివృద్ధిపై మీ అభిప్రాయం. వచ్చే ఎన్నికల్లో ఎన్ని డివిజన్లు గెలుస్తారు..?
ఖమ్మం నగరంలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఖమ్మం సర్వతోముఖాభివృద్ధి జరుగుతుంది. ఖమ్మానికి మణిహారం తీగల వంతెన, పర్యాటక ప్రాంతంగా ఖమ్మం ఖిల్లా రోప్ వే, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు, మెడికల్ కాలేజ్ నూతన భవన నిర్మాణం పనులు జరుగుతున్నాయి. రాష్ట్రానికే ఆదర్శంగా దేశములో రెండోదిగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పనులు నగరంలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నగరంలో నిరంతర తాగునీటి సరఫరా కోసం పనులు జరుగుతున్నాయి. ఇంకా రోడ్ల విస్తరణ, డ్రైనేజీల నిర్మాణం, తదితర మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోంది. దీంతో తప్పకుండా కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని డివిజన్లను గెలుచుకుంటాం.
గత కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో కొంత గలాటా జరిగింది. ముందు గెలిచినట్టు ప్రకటించినప్పటికీ కొన్ని అవాంతరాల తదనంతరం ఓడిపోయినట్టు ప్రకటించారు. అందులో మీరు కూడా ఉన్నారు. దీనిపై మీ కామెంట్..?
జరిగిపోయిన వాటి గురించి చర్చ అవసరంలేదు. మా ప్రభుత్వ హాయాంలో అత్యంత పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది.
మీ గురించి చెప్పండి..?
నేను ఎన్.ఎస్.యు.ఐ విద్యార్థి సంఘంలో తొలుత చేరాను. నాదెండ్ల భాస్కరరావు పని చేస్తున్న సమయంలో పార్టీలో చేరాను. 2003 ఖమ్మం టౌన్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా, రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శిగా, 2016లో కార్పొరేటర్ గా ఎన్నికయ్యాను. 2019లో ఖమ్మం నగర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏఐసీసీ నియమించింది. 2025లో కార్పొరేషన్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యాను. ముందుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా అడిగాను. జిల్లాలో నెలకొన్న పరిస్థితుల కారణంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారు. ఏ పదవి అనేది ముఖ్యం కాదు. అప్పగించిన పనిని సమర్థవంతంగా నిర్వర్తిస్తే తప్పకుండా పార్టీ గుర్తిస్తుంది.
ఈ మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో టియుడబ్ల్యుజె (ఐజేయూ) జిల్లా అధ్యక్షకార్యదర్శులు ఏనుగు వెంకటేశ్వరరావు, మైసా పాపారావు, జాతీయ కౌన్సిల్ సభ్యులు నలజాల వెంకట్రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాటేటి వేణుగోపాల్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సామినేని మురారి, హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు కనకం సైదులు, ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి మహేందర్, యూనియన్ జిల్లా కోశాధికారి శివానంద, జిల్లా ఉపాధ్యక్షుడు పి.సత్యనారాయణ, యూనియన్ నగర అధ్యక్ష కార్యదర్శులు చెరుకుపల్లి శ్రీనివాస్, ఎన్ జనార్ధనాచారి, కోశాధికారి ఏలూరి వేణు, ప్రెస్ క్లబ్ కోశాధికారి కళ్యాణ్ చక్రవర్తి, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.


Comments