పోలీసు పహారాలో గ్లోబల్ సమ్మిట్
ఆకట్టుకున్న పోలీసు స్టాల్
హైదరాబాద్: డిసెంబర్ 09 (తెలంగాణ ముచ్చట్లు)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలోని అంతర్జాతీయ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సమ్మిట్కు విదేశీ ప్రముఖులు, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రతినిధులు హాజరయ్యే నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకోకుండా అడుగడుగునా పోలీసు పహారా మోహరించారు.ఈ బందోబస్తులో కింది స్థాయి సిబ్బంది నుంచి ఐపీఎస్ స్థాయి అధికారుల వరకు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు. సమ్మిట్ ప్రాంగణంలో ప్రత్యేకంగా పోలీసు కమాండ్ అండ్ కంట్రోల్ ఏర్పాటుచేసి వెయ్యికి పైగా సీసీ కెమెరాల సహాయంతో ప్రతి కదలికను రియల్ టైమ్లో గమనిస్తున్నారు.
*శంషాబాద్ టూ ఫ్యూచర్ సిటీ*
అంతర్జాతీయ సదస్సు నేపథ్యంలో పోలీసులు నెల రోజులుగా సమ్మిట్ ప్రాంగణంలో మకాం వేసి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ప్రాంతంలో నిరంతరం తనిఖీలు నిర్వహించాయి. ఈ ఏర్పాట్లను డీజీపి శివధర్ రెడ్డి సహా సీనియర్ అధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
నిన్నటి రోజు పలువురు ప్రముఖులు శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన అనంతరం రోడ్డు మార్గాన ఫ్యూచర్ సిటీకి చేరుకోగా, వారి రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు ప్రత్యేక వాహన బందోబస్తు చేపట్టారు.
*ఆకట్టుకున్న పోలీసు స్టాల్*
సమ్మిట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన తెలంగాణ పోలీసు
స్టాల్ విదేశీయులను విశేషంగా ఆకట్టుకుంది. సైబర్ సెక్యూరిటీ, మహిళా భద్రతా విభాగం సాధించిన విజయాలను ఆంగ్ల కరపత్రాల రూపంలో వివరించడంతో పాటు ప్రదర్శించారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు రోడ్డు మార్గంలో సందర్శించి వాహనాలను తనిఖీ చేశారు. హెల్మెట్ లేనివారికి అవగాహన కల్పించారు.


Comments