గ్లోబల్ సమ్మిట్ భద్రతపై డిజిపి శివధర్ రెడ్డి పర్యవేక్షణ
హైదరాబాద్, డిసెంబర్ 09 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్ కోసం చేపట్టిన భద్రతా ఏర్పాట్లను రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డిజిపి) బి. శివధర్ రెడ్డి మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిశితంగా పర్యవేక్షించారు. సమ్మిట్ వేదిక సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను అడిషనల్ డిజిపి మహేష్ ఎం భగవత్, రాచకొండ సిపి తో కలిసి డిజిపి సందర్శించారు.డిజిపి సమ్మిట్ వేదిక మరియు పరిసర ప్రాంతాల్లో అమలులో ఉన్న భద్రతా చర్యలను, వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ, సీసీటీవీ మానిటరింగ్ వంటి అంశాలను పరిశీలించారు. మొత్తం భద్రతా బందోబస్తులో సుమారు 6,000 మందికి పైగా పోలీసు సిబ్బంది భాగస్వామ్యమయ్యారు. వారిని పూర్ణ అప్రమత్తతతో, సమన్వయంతో విధులు నిర్వర్తించమని డిజిపి సూచించారు.
ఇటీవల గ్రూప్-1 ద్వారా డీఎస్పీలుగా ఎంపికైన 112 మంది ప్రొబేషనరీ డీఎస్పీలను వివిధ కీలక బాధ్యతలలో నియమించగా, వీరిలో 30 మంది దేశ, విదేశాల నుండి వచ్చే ప్రముఖ ప్రతినిధులకు లైజాన్ ఆఫీసర్లుగా కేటాయించబడ్డారు. మిగతా యువ డీఎస్పీలు గ్లోబల్ సమ్మిట్ వేదికలో ఇతర కీలక పోస్టింగ్లలో విధులు నిర్వహిస్తున్నారు.తెలంగాణ రాష్ట్రానికి తాజాగా కేటాయించబడిన నలుగురు ఐపీఎస్ అధికారులకు కూడా భద్రతా ఏర్పాట్లలో ముఖ్య బాధ్యతలు అప్పగించడం జరిగింది. భద్రతా పర్యవేక్షణలో ముగ్గురు అడిషనల్ డిజిపిలు, ఐదుగురు ఐజిపిలు, పది మంది ఐపీఎస్ అధికారులు ఉన్నత స్థాయి పర్యవేక్షణను చేపట్టారు.
డిజిపి మాట్లాడుతూ, ప్రతి అధికారికి మరియు సిబ్బందికి పూర్తిగా అప్రమత్తత, సమన్వయం అవసరం ఉన్నందున విధులు సమగ్రంగా నిర్వహించాలనీ, భద్రతా ఏర్పాట్లపై వ్యక్తిగతంగా ఆరా తీశారు.


Comments