ఆపదలో ఉన్న వారికి అండగా 108
24 గంటలు అందుబాటులో సేవలు
మహబూబాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
★జిల్లా వ్యాప్తంగా చక్కని సేవలను అందిస్తున్న 108
★ ఎందరికో ప్రాణదానం చేసిన 108
★ వాహనంలో అందుబాటులో సమర్ధవంతమైన సిబ్బంది
★ జీపీఎస్ సహాయంతో సేవలు మరింత మెరుగు
ఆపదలో ఉన్నవారికి అండగా 108 అంబులెన్సులు నిలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా 24 గంటలు అత్యవసర సేవల కోసం ఉచితంగా కాల్ చేయగల టోల్ ఫ్రీ నెంబరు 108. కాగా ఈ 108 సర్వీసులు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా చక్కని సేవలు అందిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటుంది. క్షతగాత్రులను సకాలంలో ఆసుపత్రులకు చేర్చడం ద్వారా ఎందరికో ప్రాణదానం చేస్తుంది 108.
ఎలా పనిచేస్తుందంటే.....
ఎవరైనా 108కు కాల్ చేసి ఆపదలో ఉన్నామని తెలియజేస్తే వారికున్న జీపీఎస్ సహాయంతో దగ్గరలోని అంబులెన్స్ సంఘటన స్థలానికి 18-20 నిమిషాల్లో చేరుకుంటుంది. అంతేగాక అత్యవసర పరిస్థితులలో ఉన్న వ్యక్తులకు సిబ్బంది తక్షణమే వైద్య సేవలను అందిస్తారు. తదుపరి చికిత్స కోసం ఆసుపత్రులకు సకాలంలో చేరవేస్తారు. ఆసుపత్రికి చేరే వరకు సైతం అంబులెన్స్ లో ఆసుపత్రి స్థాయికి ఏ మాత్రం తీసిపోకుండా వైద్యంను అందిస్తారు. ఇందుకోసం 108 అంబులెన్స్ లో శిక్షణ పొందిన ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్ (ఈఎంటీ), వాహనాన్ని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చగల సమర్ధవంతుడైన పైలట్ లు ఉంటారు.
సౌకర్యాల వివరాలు.. :
అత్యవసర రోగులు, బాధితులకు చికిత్స అందిస్తూ ఆసుపత్రికి
చేర్చడానికి 108 అంబులెన్స్ లో అవసరమైన అన్నిరకాల వైద్యపరికరాలు ఉంటాయి. గ్లూకోమీటర్, బీపీ ఆపరేటర్, ధర్మమీటర్, విషం తాగిన వారికి చికిత్స అందించడానికి సక్షన్ ఆపరేటర్, గుండెపోటు బాధితులకు షాకింగ్ చికిత్స అందించడానికి కార్డియాక్ ఏఈడీ యంత్రం, ఆక్సిజన్, స్ట్రెచర్, కాలుచేతులు విరిగి లేవలేనివారికి స్కూప్ స్ట్రెచర్, ప్రమాదంలో వెన్నుపూస విరిగి కదలలేని వారికి స్పైన్ బోర్డు తదితర వైద్య పరికరాలు ఉంటాయి. ఆసుపత్రిలో చేర్చేవరకు ఆ పరికరాలను ఉపయోగిస్తూ రోగులకు ఈఎంటీలు ప్రాథమిక చికిత్స అందిస్తారు.
జీపీఎస్ సంకేతికతతో సేవలు....
అత్యవసర అంబులెన్స్ సేవలలో జీపీఎస్ సాంకేతికతను వినియోగిస్తున్నారు. అందరికీ ట్యాబ్లు ఇచ్చారు. ప్రతి అంబులెన్స్ ఈఎంటీ ట్యాబ్ ఆధారంగా సేవలను అందిస్తారు. ఉదాహరణకు మహబూబాబాద్ నుంచి ఎంజీఎం వరంగల్ ఆసుపత్రికి బాధితుడిని తీసుకొచ్చిన 108 అంబులెన్స్ తిరిగి వెళ్తున్నప్పుడు ఆ సమయాన్ని ట్యాబ్లో నమోదుచేస్తారు. ఆ అంబులెన్స్ వెళ్తున్నప్పుడు దాని పరిసరాల్లో ఏదైనా సంఘటన జరిగితే దానికి వెంటనే సమాచారం వెళ్తుంది. అందులో ఆ బాధితులను
ఆసుపత్రికి తిరిగి చేరుస్తారు. దీంతో ఇతర సేవలో ఉన్న అంబులెన్స్ వచ్చే వరకు జాప్యం జరుగదు.
108 సేవలను సద్వినియోగం చేసుకోవాలి
★ బత్తిని మహేష్ (మహబూబాబాద్ జిల్లా మేనేజర్)
జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు 108 సేవలను సద్వినియోగం చేసుకోవాలి. ఫోన్ చేసిన 20 నిమిషాలలోపు అంబులెన్స్ సంఘటన స్థలానికి చేరుకొని అత్యాధునిక చికిత్సను అందిస్తూ ఆసుపత్రికి తరలిస్తాము. అందువల్ల బాధితుడికి మెరుగైన వైద్యం అంది ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.


Comments