వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకుందాం
పీస్ కమిటీ మీటింగ్ లో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పిలుపు
మక్తల్,తెలంగాణ ముచ్చట్లు:
పట్టణంలో రాబోయే వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకుని అందరికీ ఆదర్శంగా నిలుద్దామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. పట్టణంలోని వట్టం రవి కన్వెన్షన్ హల్ లో సీఐ చంద్రశేఖర్, ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతి సమావేశంలో ఎమ్మెల్యే తోపాటు బీజేపీ రాష్ట్ర నాయకులు బి.కొండయ్య, బీఆర్ ఎస్ నియోజకవర్గ నాయకులు రాజుల ఆశిరెడ్డి , ధార్మిక సంస్థల ప్రతినిధులు, మైనార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,మక్తల్ పట్టణంలో మతాల కతీతంగా హిందూ ముస్లిం సోదరులు కలిసిమెలిసి పండుగలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. తాను సైతం చిన్నతనంలో వినాయక ఉత్సవాల సమయంలో చందాల కోసం తిరిగానని గుర్తు చేసుకున్నారు. వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకుందామని, అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా ఉత్సవాలు జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నామని, వారికి ఎలాంటి సమస్యలు వచ్చినా నాయకులు అందరము అండగా ఉంటామని తెలిపారు. నిమజ్జనం సమయంలో సైతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు సూచించారు. బిజెపి నాయకులు బి కొండయ్య మాట్లాడుతూ ఉమామహేశ్వర ఆలయంలో చతుర్దశి రోజుని నిమజ్జనం పూర్తి చేస్తామని, అదే ఆనవాయితీని కొనసాగించాలని పిలుపునిచ్చారు. వినాయక ఉత్సవాల విశిష్టతను వివరించడంతోపాటు పూర్తి సాంప్రదాయబద్ధంగా ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. బి ఆర్ ఎస్ నాయకులు రాజుల ఆశిరెడ్డి మాట్లాడుతూ, వినాయక ఉత్సవాలు సజావుగా జరిగేందుకు తమ వంతు సహకారం అందిస్తామని సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీవో రమేష్, నేతలు చంద్రకాంత్ గౌడ్, గణేష్ కుమార్ ,రవికుమార్, బాల్చేడ్ మల్లికార్జున్, రాజశేఖర్ రెడ్డి, కల్లూరి నాగప్ప, సత్యనారాయణ గౌడ్ , అన్వర్ హుస్సేన్ ,శంషుద్దీన్, గణేష్ మండపాల నిర్వాహకులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.


Comments