ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి
-జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు
ముఖ్యమంత్రి పర్యటనను పటిష్ట కార్యాచరణతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి పర్యటనపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భద్రాద్రి జిల్లాలో లిఫ్ట్ ఇర్రిగేషన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం తర్వాత వైరాలో 50 వేల మంది రైతులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా అధికారులు, వారికి కేటాయించిన విధులను మనసుపెట్టి నిర్వర్తించాలన్నారు. ఈ నెల 14న సీనియర్ అధికారులు, మంత్రులు జిల్లాకు రానున్నట్లు, వసతి ఏర్పాట్లలో లోటు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆగస్టు 15న కలెక్టరేట్, పెరేడ్ గ్రౌండ్స్ లో పతాక ఆవిష్కరణ పిదప, సాంస్కృతిక కార్యక్రమాలు, అవార్డుల ప్రదానం ఉంటుందని, ఉదయం 11.30 గంటలకల్లా విధులు కేటాయించిన అధికారులు వైరా సభాస్థలి చేరుకోవాలన్నారు. స్టేజ్ పై ఏర్పాట్లు, ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించడం చేయాలన్నారు. అగ్రికల్చర్, హార్టికల్చర్, పశుసంవర్ధక శాఖలకు డెకరేషన్ బాధ్యతలు అప్పగించామన్నారు. 200 మందితో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. 8 ఎంక్లోజర్లు వుంటాయని, క్రౌడ్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యమని అన్నారు. 4 చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. ప్రవేశం, నిష్క్రమణ లపై అవగాహన కల్గివుండాలన్నారు. 3 గ్రీన్ రూమ్ లకు బాధ్యులను కేటాయించాలన్నారు. అగ్నిమాపక అధికారులు ఫైర్ ఇంజన్, అగ్నిమాపక పరికరాలతో అందుబాటులో వుండాలన్నారు. జనరేటర్లు అందుబాటులో ఉంచాలని, అంతరాయం లేని విద్యుత్ సరఫరా ఉండాలని ఆయన తెలిపారు. బారికేడ్లు, పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. వైద్య శిబిరాలను హెలీప్యాడ్, సభాస్థలిలో ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. అధికారులు సమన్వయంతో, ఎక్కడ తప్పిదాలకితావివ్వకుండా పర్యటన సాఫీగా జరిగేలా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, ఇంచార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సన్యాసయ్య, జిల్లా రెవెన్యూ అధికారిణి ఎం. రాజేశ్వరి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments