గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు.....
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వర రావు
-పెండింగ్ అంగన్వాడీ భవనాలను పూర్తి చేయాలి
రఘునాథపాలెం మండలంలోని పలు గ్రామాలలో పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు
గ్రామాలలో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.సోమవారం రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వర రావు రఘునాథపాలెం మండలంలో పలు గ్రామాలలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రఘునాథపాలెం మండలంలో మంత్రి పర్యటించి ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్. నిధులు అంచనా విలువ రూ. 17.50 లక్షలతో రజబ్ అలీ నగర్ లో చేపట్టిన అంతర్గత (6) సి.సి. రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు, రూ. 30 లక్షలతో ఎన్.వి. బంజరలో చేపట్టిన (7) సి.సి. రోడ్డు నిర్మాణ పనులకు, రూ. 87 లక్షలతో పంగిడిలో చేపట్టిన (22) సి.సి. రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా *మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ,* డ్రైన్, రోడ్డు నిర్మాణ సమయంలో లెవల్స్ సరిగ్గా మెయింటైన్ చేయాలని లేని పక్షంలో మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని మంత్రి అధికారులకు సూచించారు. గుడిసెలు, రేకుల షెడ్ల లలో ఉంటున్న వారి వివరాలు అందజేస్తే వారికి అర్హత మేరకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. రఘునాథ పాలెం మండలంలో పోడు పట్టాలు జారీ చేసిన గిరిజన రైతులు వారి పొలాల్లో వేసుకున్న బోర్లకు విద్యుత్తు కనెక్షన్ అందజేసేందుకు అవసరమైన అనుమతులు వెంటనే జారీ చేయాలని మంత్రి గిరిజన శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. సర్వే జరిగి మిగిలి ఉన్న పోడు భూముల పంపిణీకి చర్యలు తీసుకోవాలని మంత్రి గిరిజన అభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో చరవాణిలో ఆదేశించారు. రఘునాథపాలెం మండలంలో పెండింగ్ లో ఉన్న అంగన్వాడీ భవనాల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని, అవసరమైన నిధులను ప్రత్యేకంగా అందజేయడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. 2 లక్షలకు పైగా ఉన్న రుణాలకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటిస్తుందని, దాని ప్రకారం లబ్ధిదారులు 2 లక్షల పైన ఉన్న రుణాలు చెల్లిస్తే ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ సొమ్ము విడుదల చేస్తుందని అన్నారు.ఎన్.వి. బంజార గ్రామంలో ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాలు ఉన్న పొలాల్లో వేసిన బోర్లకు విద్యుత్ కనెక్షన్లు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్రామంలో అవసరమైన అదనపు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని మంత్రి విద్యుత్ శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. ఈ
కార్యక్రమంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, పంచాయతీ రాజ్ డి.ఈ. యు.మహేష్ బాబు, ఏ.ఈ.- జే. చిరంజీవి,ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Comments