ప్రతి కుటుంబం వివరాలు సేకరించాలి
అధికారులు పకడ్బందీగా పర్యవేక్షణ చేపట్టాలి
ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ పైలట్ సర్వేను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
జి
ల్లాలో గురువారం నుండి పైలట్ సర్వే క్రింద చేపడుతున్న తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే ను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. గురువారం కలెక్టర్, రఘునాధపాలెం మండలం రాములు తాండ గ్రామ పంచాయతీ లో చేపడుతున్న సర్వే ను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. సర్వే లో భాగంగా కుటుంబం నుండి సేకరిస్తున్న వివరాలను కలెక్టర్ పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫోటోను కలెక్టర్ స్వయంగా మొబైల్ చేతపట్టి తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని కుటుంబాలకు ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి పైలట్ సర్వే క్రింద నియోజకవర్గంలో 2 ప్రాంతాలు, ఒకటి పట్టణ, రెండోది గ్రామీణ ప్రాంతంలో ఎంచుకొని చేపడుతున్నట్లు తెలిపారు. కుటుంబంలో పెద్ద మహిళను కుటుంబ పెద్దగా చూపెట్టాలని ఆయన తెలిపారు. ప్రతి కుటుంబానికి ఒక ఐడి, కుటుంబం లో ఉన్న ప్రతి సభ్యునికి ఒక్కో ఐడి ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. వివరాల సేకరణలో ఆధార్ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఒక రాష్ట్రం, ఒక కార్డ్ క్రింద రాష్ట్రంలో కుటుంబ గుర్తింపు కార్డుగా ఉంటుందని ఆయన తెలిపారు. అధికారులకు వివరాలు అందించి, సర్వే కు సహకరించాలని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ పర్యటన సందర్భంగా రఘునాధపాలెం మండల ఎంపిడిఓ అశోక్ కుమార్, తహసీల్దార్ లూథర్ విల్సన్, అధికారులు తదితరులు ఉన్నారు.


Comments