స్వచ్ఛంద మద్యపాన నియంత్రణ మంచి భవిష్యత్తుకు నాంది
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
తెలంగాణ ముచ్చట్లు, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-
స్వ
చ్ఛందంగా మద్యపానాన్ని నిషేధించడం, నియంత్రించడం మంచి భవిష్యత్తుకు నాంది అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని జిల్లాలోని దండేపల్లి మండల కేంద్రంలో గల మహాత్మాగాంధీ విగ్రహానికి డిసిపి భాస్కర్, మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావులతో కలిసి పూలమాల వేసిన అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన వేడుకలలో మహాత్మాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధీ అహింస, శాంతి మార్గాల ద్వారా అలుపెరగని పోరాటం చేసి విజయం సాధించి స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం కలిగిన దేశాన్ని అందించారని అన్నారు. స్వాతంత్య్రం అనంతరం భారతదేశ నిర్మాణంలో లాల్ బహదూర్ శాస్త్రి ముఖ్య పాత్ర పోషించారని, వివిధ మంత్రి పదవులలో వినూత్న సంస్కరణలు, ఆర్థిక విధానాల ద్వారా దేశాభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. మనిషి ఆలోచన, విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయేలా చేసి అవాంఛనీయ ఘటనలకు కారణమయ్యే మద్యపానాన్ని నియంత్రించాలని అన్నారు. మద్యం త్రాగడం వలన మానసిక స్థితిలో ఇబ్బందులు ఏర్పడి విచక్షణా జ్ఞానం లోపించి, విపరీత ఆలోచనలతో నేరాలకు పాల్పడే ప్రమాదం ఉంటుందని, నేరప్రవృత్తి పెరిగే అవకాశం ఉంటుందని, మద్యం, డ్రగ్స్ నియంత్రించాలని అన్నారు. మొట్టమొదటిసారిగా జిల్లాలోని దండేపల్లి మండలం నుండి స్వచ్చంద మద్యపాన నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని ప్రజలు స్వచ్ఛంధంగా నిర్వహించి రాష్ట్రానికి ఆదర్శంగా నిలువాలని, ఒక సంవత్సరం పాటు మద్యపానం చేయకుండా స్ఫూర్తినివ్వాలని అన్నారు. ప్రభుత్వం మహిళా శక్తి పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు పథకంలో పొందుపరిచిన అనేక అంశాల ద్వారా ప్రోత్సహిస్తుందని, ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్వావలంబన పొందాలని అన్నారు. విద్య, వైద్యం అంశాలపై జిల్లాలో ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని, జిల్లాలోని బాల బాలికలు ఖచ్చితంగా చదువుకునేలా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడంతో పాటు అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. మద్యపానాన్ని నిషేధించడం, నియంత్రించడంతో ఆరోగ్య స్థితిగతులలో మార్పులు వస్తాయని, ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు ఆస్కారం ఉంటుందని, ఇదే పద్దతిని కొనసాగిస్తూ రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. అనంతరం లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. అంతకు ముందు దండేపల్లి మండలం లింగాపూర్ లోని తెలంగాణ ఆదర్శ పాఠశాలకు సంబంధించి 25 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులతో గ్రామీణ నీటి సరఫరా (ఎంబి) ఇంజనీరింగ్ విభాగం ద్వారా మంజూరైన ఓవర్హెడ్ సర్వీస్ రిజర్వాయర్, 1 కోటి 15 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా మంజూరైన మరమ్మత్తులు, భౌతిక మౌళిక సదుపాయాలకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల తహశిల్దార్లు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.


Comments