10వ వార్డులో కోతుల బెడదకు చెక్.!
- కౌన్సిలర్ దేవ జ్యోతి చర్యలు ఫలితం.
- కోతుల పట్టివేత, అటవీ ప్రాంతానికి తరలింపు.
సత్తుపల్లి, ఏప్రిల్ 5 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో కొంతకాలంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కోతుల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. కోతులు గుంపులుగా సంచరిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు ఇళ్లలోకి చొరబడి వస్తువులను ధ్వంసం చేస్తున్నాయని నివాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను వార్డు కౌన్సిలర్ దేవ జ్యోతి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, మున్సిపల్ చైర్పర్సన్ రిహన కమల్ పాషా దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, కోతుల సమస్య నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వారి మార్గదర్శకత్వంలో మున్సిపాలిటీ ప్రత్యేక కోతి పట్టే బృందాన్ని రంగంలోకి దించింది. శనివారం వార్డులోని పలు వీధుల్లో గాలింపు చేపట్టిన బృందం చాకచక్యంగా కోతులను పట్టుకుని బోన్లలో బంధించింది. పట్టుబడిన కోతులను అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలివేయనున్నట్లు అధికారులు తెలిపారు. చాలా రోజులుగా ఎదుర్కొంటున్న సమస్య నుంచి విముక్తి కలగడంతో వార్డు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.సమస్య పరిష్కారానికి సహకరించిన ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వార్డు ప్రముఖులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.


Comments