దొడ్డి కొమరయ్య 99వ జయంతి వేడుకలు
_సాయుధ పోరాటానికి స్ఫూర్తిదాయకమైన అమరవీరునికి నివాళులు
ఏ ఎస్ రావు నగర్, ఏప్రిల్ 3 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో శుక్రవారం కమలానగర్ కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 99వ జయంతి సందర్భంగా సంస్మరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమం ప్రారంభంలో దొడ్డి కొమరయ్య చిత్రపటానికి ప్రముఖ దంత వైద్యులు నరసింహ, భవన నిర్మాణ కార్మిక జిల్లా నాయకులు అశోక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా స్ఫూర్తి గ్రూప్ సీనియర్ నాయకులు శ్రీమన్నారాయణ మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాట ప్రారంభ దశలో విసునూరు దేశముఖ్ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా భూమి, భుక్తి కోసం జరిగిన పోరాటంలో దొడ్డి కొమరయ్య చేసిన త్యాగం చారిత్రాత్మకమని తెలిపారు. ఆయన వీరమరణం తెలంగాణ వ్యాప్తంగా రైతాంగాన్ని సాయుధ పోరాటానికి ప్రేరేపించిందని అన్నారు.నిజాం పాలనలో జమీందారుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాగిన ఈ పోరాటం దేశవ్యాప్తంగా భూ ఉద్యమాలకు మార్గదర్శకంగా నిలిచిందని పేర్కొన్నారు. దొడ్డి కొమరయ్య, బందగి వంటి అమరవీరుల త్యాగఫలితంగా బెంగాల్లో తేబాగా ఉద్యమం, మహారాష్ట్రలో వర్లీ పోరాటం, కేరళలో పున్నప్ర-వయలార్ పోరాటాలు వెలుగులోకి వచ్చాయని వివరించారు.మాజీ కౌన్సిలర్ చల్లా లీలావతి మాట్లాడుతూ సాయుధ పోరాట విశిష్టతను వివరించి, భూమి కోసం భుక్తి కోసం సాగిన పోరాటాలపై ప్రేరణాత్మక గీతాన్ని ఆలపించారు.ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వరరావు, జి. శివరామకృష్ణ, లక్ష్మయ్య, గుమ్మడి హరిప్రసాద్, రోజారాణి, గౌసియా, శశిధర్ రెడ్డి, శివన్నారాయణ, ఎం. భాస్కర్ రావు, బంగారు నర్సింగరావు, శ్రీనివాస్, జయరాజ్, నవతెలంగాణ రవి తదితరులు పాల్గొన్నారు.


Comments