ఏప్రిల్ 30 వరకు సాగర్ నీటిని విడుదల చేయండి
అధికారులకు సిపిఐ వినతి
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 4(తెలంగాణ ముచ్చట్లు)
నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో ఏప్రిల్ 30 వరకు సాగర్ నీటిని విడుదల చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు నేతృత్వంలో నాగార్జున సాగర్ చీఫ్ ఇంజనీర్ మంగళ పూడి వెంకటేశ్వర్లుకు శనివారం ఈ మేరకు -వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా హేమంతరావు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టు -ఎడమ కాలువ పరిధిలో సుమారు రెండున్నర లక్షల ఎకరాలు సాగవుతుందని ఆయన తెలిపారు. రెండవ పంటగా సాగు చేసిన వరి, మొక్కజొన్న, మిర్చితో పాటు ఇతర పంటలకు ఈనెలాఖరు వరకు సాగునీరు అవసరం ఉందన్నారు. వారబంధి లేదా నీటి విడుదల పరిమాణాన్ని తగ్గిస్తే చివరి ఆయకట్టుకు నీరందక రైతులు ఇబ్బందులు పడే ప్రమాదం ఉందన్నారు. ఏప్రిల్ చివరి వరకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయాలని కోరారు. దీనికి సిఈ స్పందిస్తూ నీటి అవసరాలు ఉన్న మాట వాస్తవమేనని ఉన్నతాధికారులతో మాట్లాడి ఈనెలాఖరు వరకు సాగునీటిని -అందించే ప్రయత్నం చేస్తామని, పంటలను కాపాడతామని ఆయన తెలిపారు. వినతి పత్రం సమర్పించిన వారిలో సిపిఐ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ మహ్మద్ మౌలానా, సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దొండపాటి రమేష్, రైతు సంఘం నాయకులు నంబూరి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.


Comments