ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు
_కట్టుదిట్టమైన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ
హైదరాబాద్, ఏప్రిల్ 2 (తెలంగాణ ముచ్చట్లు):
టాటా ఐపీఎల్-2026 మ్యాచ్లు ఏప్రిల్ 5 నుండి మే 22 వరకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, ఉప్పల్లో జరగనున్న నేపథ్యంలో పోలీసులు విస్తృత భద్రతా, ట్రాఫిక్ ఏర్పాట్లు చేపట్టారు. సుమారు 39,000 మంది ప్రేక్షకులు హాజరయ్యే అవకాశం ఉండటంతో అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.పోలీసులు సుమారు 2,000 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, సెక్యూరిటీ వింగ్, టిఎస్ఎస్పి/ఏఆర్ ఫోర్సులు, మౌంటెడ్ పోలీస్ బృందాలు పాల్గొంటున్నాయి. స్టేడియం లోపల మరియు వెలుపల 430 సీసీ కెమెరాల ద్వారా నిఘా కొనసాగుతుంది. జాయింట్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ చేపట్టనున్నారు. బాంబ్ డిస్పోజల్ టీమ్స్, స్నిఫర్ డాగ్స్తో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తారు. ప్రేక్షకుల భద్రత దృష్ట్యా ల్యాప్టాప్లు, బ్యాగులు, కెమెరాలు, వాటర్ బాటిళ్లు, సిగరెట్లు, లైటర్లు, లోహ వస్తువులు, బైనాక్యులర్లు, పెన్నులు, బ్యాటరీలు, పర్ఫ్యూమ్స్, లేజర్ పాయింటర్లు, బయటి ఆహారం వంటి నిషేధిత వస్తువులను స్టేడియంలోకి అనుమతించరని అధికారులు స్పష్టం చేశారు. స్టేడియం వద్ద క్లోక్ రూమ్ సౌకర్యం లేదని పేర్కొన్నారు.మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా షీ టీమ్స్ను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల కోసం 5 అంబులెన్సులు, 4 ఫైర్ ఇంజన్లు సిద్ధంగా ఉంచారు. ఏప్రిల్ 13 నుంచి జరిగే మ్యాచ్లకు డిజిటల్ టికెటింగ్ విధానం అమలు చేయనున్నారు.మ్యాచ్ రోజుల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 11:50 వరకు ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. భారీ వాహనాలకు ఉప్పల్ వైపు ప్రవేశం నిషేధించి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లిస్తారు. వరంగల్ వైపు వెళ్లే వాహనదారులు ఓఆర్ఆర్ మార్గాన్ని వినియోగించాలని సూచించారు.హబ్సిగూడ, రామంతాపూర్ వైపులా ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. స్టేడియం లోపలికి కేవలం పాస్ ఉన్న వీవీఐపీ, వీఐపీ వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది.ట్రాఫిక్ సమస్యలు నివారించేందుకు ప్రేక్షకులు మెట్రో రైలు లేదా ఆర్టీసీ బస్సులను వినియోగించాలని పోలీసులు సూచించారు.


Comments